అమిత్ షాకు బండి సంజయ్ నోట్, కీలక చర్చ: సాంకేతిక లోపంతో మరో విమానంలో కేరళకు
కేంద్రమంత్రి అమిత్ షా ప్రయాణించే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఉదయం 11.50 గంటలకు కేరళకు వెళ్లాల్సి ఉండగా.. విమానంలో సాంకేతిక లోపంతో పర్యటన ఆలస్యమైంది.
హైదరాబాద్: కేంద్రమంత్రి అమిత్ షా ప్రయాణించే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఉదయం 11.50 గంటలకు కేరళకు వెళ్లాల్సి ఉండగా.. విమానంలో సాంకేతిక లోపంతో పర్యటన ఆలస్యమైంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై వారితో చర్చించారు.

అమిత్ షా విమానంలో సాంకేతిక లోపం
హకీంపేటలోని సీఐఎస్ఎఫ్ 54వ వ్యవస్థాపక దినోత్సవానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. శనివారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్కు వచ్చిన ఆయన అధికారిక కార్యక్రమం అనంతరం ఉదయం 11.50 గంటలకు హాకీంపేట విమానాశ్రయం నుంచి కేరళ రాష్ట్రంలోని కొచ్చికి బయల్దేరాల్సి ఉంది.

తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ
అయితే, విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అమిత్ కొంత సమయం వేచివుండాల్సి వచ్చింది. ఈ క్రమంలో మరో విమానం వచ్చే వరకు ఆయన ఇక్కడే ఉండి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నేత లక్ష్మణ్లతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై రెండు గంటలపాటు చర్చించారు. కవిత విచారణ నేపథ్యంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులు, నేతల మధ్య సమన్వయం, పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చించారు.

అమిత్ షాకు బండి సంజయ్ నోట్: కీలక సూచన
తెలంగాణ రాజకీయాలపై బండి సంజయ్.. అమిత్ షాకు ఒక నోట్ అందించినట్లు సమాచారం. సంజయ్ అందించిన నోట్పై లోతైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని.. నేతలు మరింత కలిసికట్టుగా పనిచేస్తే అధికారం తథ్యమని అమిత్ షా చెప్పినట్లు తెలిసింది. రాష్ట్ర నేతల పనితీరుకు అమిత్ షా అభినందించడంతోపాటు చేరికలపై దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలిసింది. కాగా, ఈ భేటీ అనంతరం 3.30 గంటలకు మరో విమానంలో కొచ్చికి బయల్దేరి వెళ్లారు అమిత్ షా.












Click it and Unblock the Notifications