తీన్మార్ మల్లన్న జర్నలిస్టే కాదు.. రిపోర్ట్ చేయలే, మంత్రి కొప్పుల విమర్శలు
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్తో బీజేపీ ఢీ అంటే ఢీ అంటోంది. అయితే తీర్మార్ మల్లన్న అలియాన్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఇన్నాళ్లు జర్నలిస్టు ముసుగులో ఉండి.. ఇప్పుడు పార్టీలో చేరవా అంటూ విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ఫైరయ్యారు.

యాంకరే..?
తీన్మార్ మల్లన్న యాంకర్ మాత్రమేనని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అతను జర్నలిస్టు కాడని ఆయన స్పష్టం చేశారు. ఆయన ఏ పత్రికలో కానీ, ఛానల్లో రిపోర్టర్గా పని చేయలేదన్నారు. సమాజంలో జర్నలిస్టుకు ఒక హోదా, గుర్తింపు ఉందని గుర్తుచేశారు. సంఘ్ పరివార్కు చెందిన ఆయన జర్నలిస్టు ముసుగేసుకుని బీజేపీ కోసం పని చేశాడని ఆరోపించారు. బీజేపీ మద్దతుగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను బద్నాం చేస్తూ..రాష్ట్రంలో సుస్థిర రాజకీయ వ్యవస్థను అస్థిరపర్చే పనిలో నిమగ్నమయ్యాడని వివరించారు. నవీన్ తనకు తాను అతిగా అంచనా వేసుకుని, పగటి కలలు కంటున్నారని మంత్రి కామెంట్ చేశారు.

బ్లాక్ మెయిల్ చేసి
బెదిరింపులు, బ్లాక్ మెయిళ్లకు పాల్పడి బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిన విషయాన్ని గుర్తు చేశారు. జైలులో రెండు నెలలు ఊచలు లెక్కపెట్టినా కూడా ఆయనలో మార్పు రాకపోవడం..ఎలుక తోలు తెచ్చి ఏన్నాళ్లు ఉతికినా నలుపు నలుపే గానీ తెలుపు కాదు అన్న చందంగా ఉందన్నారు. నవీన్ మాటలను మంత్రి ఖండించారు. అరాచక, నిరంకుశ పాలనకు, వారసత్వ రాజకీయాలకు బీజేపీ కేరాఫ్ అడ్రస్గా ఉందని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. బాబ్రీమసీదును కూల్చి, గోద్రాలో ముస్లింలు, ఎస్సీలను ఊచకోత కోసి అరాచకానికి పాల్పడినది బీజేపీ కాదా? అని నిలదీశారు.
Recommended Video

అంతా నాశనం..
బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేస్తుందని.. మోడీ పాలనను మంత్రి దుయ్యబట్టారు. ఇటీవల నియమితులైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు కారం రవీందర్ రెడ్డి, సత్యనారాయణ, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్, ఉపేంద్రాచారి, సుభప్రద్ పటేల్ ఉద్యమకారులు కాదా?అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కామెంట్ చేయడం,హేళన చేయడం మానుకుని సంస్కారంతో మెలగాలని సూచించారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని తీన్మార్ మల్లన్నను హెచ్చరించారు.












Click it and Unblock the Notifications