కరోనా లాక్డౌన్పై మే 5న తేల్చనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణలో మే 7తో లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో మే 5న ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కీలక భేటీ జరగనుంది. ఈ భేటీలో కరోనా వ్యాప్తి నివారణ, లాక్డౌన్ పరిస్థితులపై చర్చించనున్నారు. ప్రగతి భవన్ లో ఈ భేటీ జరగనుంది.
కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్ డౌన్ విధించగా, తెలంగాణ సర్కారు మే 7 వరకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. మే 7 లాక్ డౌన్ రాష్ట్రంలో ముగియనుండటంతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు, మార్గదర్శకాలను రూపొందించేందుకు మే 5న ఈ సమావేశం జరగనుంది.
కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మే 5న భేటీ అనంతరం సీఎం కేసీఆర్ లాక్ డౌన్ పొడిగించడమా? సడలింపులు ఇవ్వడమా అనేదానిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 1016 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 409 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 582 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం రాష్ట్రంలో 25 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ నగరంలో 548 మంది కరోనా బారిన పడటం గమనార్హం.
ఆ తర్వాత సూర్యపేట 83, నిజామాబాద్ 61, జోగులాంబ గద్వాల 45, వికారాబాద్ 37, రంగారెడ్డి 37, వరంగల్ అర్బన్ 27, మేడ్చల్ 22, ఆదిలాబాద్ 21, నిర్మల్ 20, కరీంనగర్ 19, నల్గొండ 17, కామారెడ్డి 12, మహబూబ్ నగర్ 11, ఖమ్మం 8, సంగారెడ్డి 7, కుమురం భీమ్ ఆసిఫాబాద్ 7, మెదక్ 5, భద్రాద్రి కొత్తగూడెం 4, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, జనగాం, జగిత్యాల జిల్లాల్లో 3 చొప్పున, పెద్దపల్లిలో 2, నాగర్ కర్నూల్ 2, ములుగు 2, సిద్దిపేట, నారాయణపేట, మంచిర్యాల, మహబూబాబాద్, గుర్తింపు లేనివి 7 కేసులున్నాయి.