Hyderabad: గడువులోగా అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం పూర్తవుతుందా..!
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లో నిర్మిస్తున్న 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి రోజు ఆవిష్కరించనున్నారు. 45 అడుగుల వెడల్పు, 125 అడుగుల ఎత్తున్న డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం పరిశీలించారు.
అయితే ప్రారంభోత్సవానికి 18 రోజులు మాత్రమే ఉండటం, పనులు పూర్తికాకపోవడంతో సమయానికి ఆవిష్కరణ జరుగుతుందా లేదా అనే సందిగ్ధం ఏర్పడింది. ఇప్పటివరకు విగ్రహం పనులు 70 నుంచి 75 మేర పూర్తవ్వగా.. ఇంకా తల, చేయి భాగాలు బిగించాల్సి ఉంది. విగ్రహం కింది అంతస్తుల్లో ఏర్పాటు చేయదల్చిన అంబేడ్కర్ జీవిత చరిత్ర మ్యూజియం, యాంప్ థియేటర్ పనులు పెండింగ్లో పడ్డాయి. ప్రహరీతోపాటు అంబేడ్కర్ విగ్రహానికి చేరుకునే మెట్ల మార్గం ఇంకా పూర్తికాలేదు. దీనిపై శాంతికుమారి ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి, హైవేలు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజుతో కలిసి ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్షించారు. ఏప్రిల్ 10లోగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆమె కోరారు. విగ్రహం స్థావరంలో నిర్మిస్తున్న 100 సీట్ల యాంఫీథియేటర్ను ప్రధాన కార్యదర్శి పరిశీలించారు.

మరోవైపు పంజాగుట్ట చౌరస్తాలో డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహం పెట్టాలని నిర్ణయించింది. అంబేడ్కర్ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించున్నారు. విగ్రహం ఏర్పాటు పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిశీలించారు. పంజాగుట్ట చౌరస్తాలో నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహాన్ని జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా పోరాటం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అక్కడే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చాలా సార్లు ఆందోళలు చేశారు. చివరికి స్పందించిన ప్రభుత్వం విగ్రహం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications