కరోనా విలయం: ఇటు లైవ్ ప్రెస్ మీట్.. అటు లాక్డౌన్పై ఫేక్ న్యూస్.. శపించిన కేసీఆర్
లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైపోయిన ప్రజలు.. ఎప్పటికప్పుడు న్యూస్ వెబ్ సైట్లు, టీవీ చానెళ్లు, వాట్సప్ సందేశాల ద్వారా కరోనా వైరస్ సమాచారాన్ని తెల్సుకుంటున్నారు. అయితే ఇదే అదనుగా కొన్ని చానెళ్లు, కొందరు వ్యక్తులు వ్యూస్ పెంచుకోడానికి ఫేక్ న్యూస్ బాపట్టారు. తద్వారా జనానికి నిజమైన సమాచారానికి బదులుగా తప్పుడు సమాచారం, అంటే, ఫేక్ న్యూస్ చేరుతోంది. దీంతో లేనిపోని భయాలు, అనవసర కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. మరీ ముఖ్యంగా కరోనా లాంటి విపత్తు సమయాల్లో సంయమనం చాలా అవసరం. కచ్చితమైన సమాచారాన్ని మాత్రమే పాఠకులకు అందించేపని నుంచి 'వన్ ఇండియా' ఎప్పుడూ పక్కకుజరగదు. ఈ ఫేక్ న్యూస్ వ్యవహారంపై ఇవాళొక సంచలన ఘటన జరిగింది.

సీఎం ప్రెస్ మీట్..
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావంపై ప్రజలకు వివరణ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలో కేసులు, మరణాల వివరాలతోపాటు, వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను వివరించారు. మూడురోజుల కిందట ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ వివరాలను కూడా కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో వరి పంట కోతకు సిద్ధంగా ఉన్నందున, హమాలీల కోసం బీహార్ ప్రభుత్వాన్ని, గన్నీ సంచుల కోసం వెస్ట్ బెంగాల్ సీఎంను రిక్వెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇదే క్రమంలో దేశవ్యాప్త లాక్ డౌన్ పైనా ఆయన సంచలన కామెంట్లు చేశారు.

కేంద్రం ఎత్తేసినా..
కరోనా వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు కాబట్టి, దేశవ్యాప్త లాక్ డౌన్ ను ఏప్రిల్ 14 తర్వాత కూడా పొడగించాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ రిక్వెస్ట్ చేశారు. అమెరికా లాంటి అగ్రదేశాలే గజగజ వణుకుతున్నవేళ.. అరకొర వైద్య సదుపాయాలున్న ఇండియాలో.. లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారమని, వైరస్ నిరోధానికి లాక్ డౌన్ మించిన దారేదిలేదని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యయన సంస్థ ‘బోస్టన్ కన్సంల్టింగ్ గ్రూప్(బీసీజీ)' పేర్కొన్న అంశాలను ఆయన ప్రస్తావించారు. ‘‘కరోనా ప్రమాదం నుంచి ఇండియా బయటపడాలంటే, జూన్ 3 దాకా లాక్ డౌన్ కొనసాగించడం మంచిది'' అని బీసీజీ చెప్పిన విషయాన్ని సీఎం వెల్లడించారు. ఒకవేళ కేంద్రం లాక్ డౌన్ ఎత్తేసినా, తెలంగాణలో మాత్రం కొనసాగించడానికి వెనుకాడబోమని మరో ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కాగా,

కరోనా శాపం పెట్టిన కేసీఆర్..
బీసీజీ రిపోర్టులోని అంశాన్ని.. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంగా కొన్ని వెబ్ సైట్లు వార్తలు రాశాయి. ఆయన లైవ్ లో మాట్లాడుతుండగానే.. ‘‘తెలంగాణలో జూన్ 3వరకు లాక్ డౌన్ ప్రకటించిన సీఎం'' అని ప్రచురించేశాయి. ఈ విషయాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. సదరు ఆర్టికల్ ను చూపిస్తూ.. ‘‘ఇంతదారుణమా? నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా తప్పుడు సమాచారం రాయడమేంటి?''అని వాపోయారాయన. ఇలాంటి ఫేక్ న్యూస్ రాసేవాళ్లకు కచ్చితంగా కరోనా సోకాలని శపిస్తున్నట్లు తెలిపారు.

ఫేక్ రాతలొద్దు.. నిజమైన హీరోలు కావాలి..
కరోనా విలయం కొనసాగుతున్నవేళ ఒకటి రెండు మీడియా సంస్థలు కావాలని, పనిగట్టుకుని తప్పుడు వార్తలు రాస్తున్నాయని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు రిపోర్టులు రాసేవాళ్లతోపాటు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పేట్రేగిపోతూ, ఫేక్ రాతలు రాసేవాళ్లపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కష్టకాలంలో నలుగురికీ అన్నం పెడుతూ, పదిమందిని ఆదుకుంటున్నవాళ్లే అసలైన హీరోలని, వాళ్లపై ఎక్కువగా వార్తలు రాయాలని సీఎం కోరారు.
Recommended Video

దేశంలోనే తొలిసారి..
ఫేక్ న్యూస్ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వమే ప్రత్యేకంగా వెబ్ సైట్ ప్రారంభించింది. ఈ తరహా ప్రయత్నం దేశంలోని తొలిసారిగా కావడం గమనార్హం. కరోనా వైరస్ పై తప్పుడు సమాచారాన్ని వైరల్ చేయడంతోపాటు కొన్ని వర్గాలను ఉద్దేశపూర్వకంగా కించపర్చేలా రాతలు రాయడం, ప్రభుత్వ నిర్ణయాలపై వక్రభాష్యాలు చెప్పడం తద్వారా ప్రజలను అయోమయంలోనికి, ఆందోళనలోకి నెట్టేస్తుండటంతో వాటిని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు https://factcheck.telangana.gov.in పేరుతో వెబ్ సైట్ ప్రారంభించింది. తప్పు చేసినట్లు రుజువైతే కఠినశిక్షలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తున్నది.












Click it and Unblock the Notifications