భయపడ్డంతా జరిగింది.. హైదరాబాద్లో డాక్టర్ దంపతులకు కరోనా పాజిటివ్.. తెలంగాణలో పెరిగిన కేసులు
''ఇది ఎంతటి కీలక తరుణమంటే.. మన వైద్య సిబ్బందిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. బయటి నుంచి కొత్తగా డాక్టర్లు రారు. మన డాక్టర్లు, నర్సులకు ఏదైనా అనుకోనిది జరిగిదే తర్వాతి పరిణామాలు ఊహించడం కష్టం. కాబట్టి అందుబాటులో ఉన్న వైద్య సిబ్బందిని, వాళ్ల ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తుంది''అని ముఖ్యమంత్రి కేసీఆర్ మూడురోజుల కిందట ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనతోపాటు రాష్ట్రమంతా భయపడ్డట్లే ఇద్దరు డాక్టర్లు కరోనా కాటుకు గురికావడం ఆందోళనకరంగా మారింది.
ఆ ఇద్దరూ..
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యకు సంబంధించి ఆరోగ్య శాఖ గురువారం మధ్యాహ్నం ఒక బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా మూడు కేసులు పెరిగాయన్న ప్రభుత్వం.. ఆ మూడు హైదరాబాద్ పరిధిలోనివేనని, అందులో ఇద్దరు డాక్టర్ దంపతులున్నారని పేర్కొంది. దోమలగూడకు చెందిన ఆ డాక్టర్ దంపతుల్లో భర్తకు 41 ఏళ్లుకాగా, భార్య వయసు 36 ఏళ్లు. పాజిటివ్ పేషెంట్ల ద్వారానే వీళ్లకి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే..
మూడో వ్యక్తి ఎవరంటే..
పాజిటివ్ గా తేలిన ఈ డాక్టర్ దంపతులు.. కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేస్తుండా వైరస్ కు గురయ్యారా లేక మరోలా సోకిందా అనేది స్పష్టంగా తెలియాల్సిఉంది. ఇక మూడో పెషెంట్ ను కుత్బూల్లా పూర్ కు చెందిన 49 ఏళ్ల వ్యక్తిగా ప్రభుత్వం పేర్కొంది. అతను ఇటీవలే ఢిల్లీకి విమానంలో ప్రయాణించాడని, కరోనా పాజిటివ్ వ్యక్తి ద్వారా వైరస్ సోకిందని బులిటెన్ లో తెలిపారు. మొత్తంగా గురువారం మధ్యాహ్నం నాటికి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43కు పెరిగింది.
భద్రతపై ఆందోళన..
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుటుండంతో డాక్టర్లు, ఇదర వైద్య సిబ్బంది భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. తమ రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు డాక్టర్ల సంఘాలు, మెడికల్ సిబ్బంది అసోసియేషన్లు ప్రభుత్వాలకు వినతులు చేస్తున్నాయి. అసోసియేషన్ సర్జన్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ పి. రఘురామ్ బుధవారం ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ పలు వినతులు చేశారు. కరోనా పేషెంట్లను డీల్ చేసే డాక్టర్లు, వైద్య సిబ్బంది భద్రత కోసం ప్రతి జిల్లాకు నోడల్ కేంద్రాలు, శిక్షణ ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు. మరోవైపు..
Recommended Video
చర్యలు తప్పవు..
డాక్టర్లు, మెడికల్ సిబ్బంది ఇబ్బందులపై ప్రధనా మోదీ, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం స్పందించారు. సిటీల్లో కరోనా వార్డుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని ఇళ్లు ఖాళీ చేయాలంటూ యజమానులు ఒత్తిడి తెస్తుండటం, వారి పట్ల అనుమానాస్పదంగా, అవమానకరంగా కొందరు ప్రవర్తిస్తుండటాన్ని ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకుంటున్నాయి. వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేవాళ్లపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.