ఇక తెలంగాణలోనూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు: మోడీ, కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
హైదరాబాద్: కేంద్రం తీసుకొచ్చిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్లకు అదనంగా విద్యా, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే.
Recommended Video

ఈ నేపథ్యంలోనే తాజాగా, ప్రభుత్వం దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని విద్యా సంస్థల ప్రవేశాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎస్ సోమేశ్ కుమార్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలోనే ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సమయంలోనే ఈ రిజర్వేషన్లు అమలు కావడంతో ఎంతో మంది నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

నరేంద్ర మోడీ, కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అగ్రవర్ణాల నిరుపేదలకు 10 శాతం రిజర్వేషన్లకు కేసీఆర్ ఆమోదం తెలపడం, ఇందుకు అనుగుణంగా సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అగ్రవర్ణాల పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మోడీ, కేసీఆర్ చిత్రపటాలకు వైశ్య, రెడ్డి, వెలమ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు.
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలను ఆదుకునేందుకు 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే 19 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ రిజర్వేషన్లు అమలు జరుగుతుండగా, తాజాగా ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరింది. దీంతో రాష్ట్రంలోని అగ్రవర్ణాల పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications