గవర్నర్ నరసింహన్ బదిలీ.. జమ్ముకశ్మీర్కేనా స్థాన చలనం..!
హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బదిలీ అవుతున్నారా? జమ్ముకశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో ఆయనను అక్కడికి పంపించాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమా? నరసింహన్ స్థానంలో తెలంగాణకు కొత్త గవర్నర్ రానున్నారా? ఈ నెలలోనే ఆయన బదిలీ ఖాయమా? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఆ తర్వాత విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయన గవర్నర్గా సేవలందించారు. ఎట్టకేలకు నరసింహన్ బదిలీ కాబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెలాఖరులోగా ఆయన బదిలీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాలకు సుదీర్ఘ కాలంగా సేవలు
2009, డిసెంబర్ 27వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరసింహన్ గవర్నర్గా నియమితులయ్యారు. తదనంతర పరిణామాలతో రాష్ట్రం విడిపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు 2014, జూన్ 2 నాటి నుంచి ఉమ్మడి గవర్నర్గా సేవలందిస్తూ వచ్చారు. అయితే గత నెల 16వ తేదీ వరకు ఆయనే గవర్నర్గా రెండు రాష్ట్రాలకు పనిచేశారు.
ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా బిశ్వభూషణ హరిచందన్ను నియమించడంతో.. తెలంగాణ గవర్నర్గా నరసింహన్ కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిన కృష్ణకాంత్ కంటే కూడా ఎక్కువ కాలం పని చేసిన గవర్నర్గా ఈసీఎల్ నరసింహన్ రికార్డుల్లోకి ఎక్కారు.

నెలాఖరులోగా బదిలీ..! విభజన సమస్యల పరిష్కారం స్పీడప్..!!
తెలుగు రాష్ట్రాలకు గవర్నర్గా వచ్చిన నరసింహన్.. వచ్చే డిసెంబర్ నాటికి పది సంవత్సరాలు కంప్లీట్ చేసుకోనున్నారు. అయితే అంతలోనే బదిలీ కానున్నారనే వార్తలొస్తున్నాయి. ఈ నెలాఖరులోగా ఆయన బదిలీ కానున్నట్లు సమాచారం. అంతలోపే ఇక్కడ రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించి ఆ ప్రక్రియను స్పీడప్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
ఆ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే దిశగా అడుగులేస్తున్నారు. గవర్నర్ నరసింహన్ చాలాకాలం నుంచి ఇక్కడే ఉండటం.. ఆయన హయాంలోనే రాష్ట్ర విభజన జరగడంతో ఆయన ఉన్నప్పుడే ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుందామనే ఆలోచన ఇద్దరిలో కనిపిస్తోంది.

జమ్ముకశ్మీర్కేనా బదిలీ..! కేంద్ర ఇంటిలిజెన్స్ డైరెక్టర్గా అనుభవం
దాదాపు పదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో సేవలందించడమే గాకుండా ఇక్కడి ప్రజలకు సుపరిచితుడిగా ఉన్న నరసింహన్ ఇప్పుడు బదిలీపై ఎక్కడకు వెళ్లనున్నారనేది చర్చానీయాంశంగా మారింది. అయితే రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్న దాని ప్రకారం ఆయనను జమ్ము కశ్మీర్కు పంపించాలనేది కేంద్రం యోచనగా కనిపిస్తోంది. ఇదివరకు ఆయన కేంద్ర ఇంటిలిజెన్స్ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం ఆయన సొంతం.
అందుకే ప్రస్తుతం జమ్ముకశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆయనను అక్కడికి పంపించే ప్రయత్నం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. శాంతిభద్రతల విషయంలో ఆయనకు పూర్తిగా పట్టుండటంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. మొత్తానికి సుదీర్ఘకాలంగా తెలుగు రాష్ట్రాలకు సేవలందించిన గవర్నర్ నరసింహన్ ఇక్కడినుంచి వెళ్లిపోవడమనేది బాధాకరమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications