ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్పై నమ్మకం లేదా?: కరోనా పరీక్షలపై సర్కారుకు హైకోర్టు ప్రశ్న
హైదరాబాద్: తెలంగాణలో తక్కువగా నిర్వహిస్తున్న కరోనా పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఐసీఎంఆర్ ఆమోదించిన ప్రైవేట్ ల్యాబ్లు, ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు, చికిత్సలకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేటు కేంద్రాలకు నేరుగా వెళ్లి డబ్బులు చెల్లించి వైద్య సేవలు పొందడం ప్రజల హక్కు అని అభిప్రాయపడింది.
ఏపీ బెటర్! మహమ్మారి కరోనా విషయంలో ఇలానా?: తెలంగాణ సర్కారుపై కేంద్రం ఆగ్రహం
గాంధీ, నిమ్స్, ప్రభుత్వం నిర్ణయించిన కేంద్రాల్లోనే పరీక్షలు, చికిత్సలు చేయించుకోవాలని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజలపై ఎలాంటి ఒత్తిడి చేయరాదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించింది. అయితే, కరోనా పరీక్షలు, చికిత్సలు చేయాలనుకునే ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్లు ఖచ్చితంగా ఐసీఎంఆర్ అనుమతి పొందాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్ల్లోనూ కరోనా పరీక్షలు, చికిత్సలకు అనుమతించాలని గంటా విజయ్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ లక్ష్మణ్లతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది.
ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్లకు అనుమతిస్తే దుర్వినియోగం చేసే అవకాశం ఉందని, కరోనా గణాంకాలు దాచిపెట్టే ప్రమాదం ఉందన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఒకవేళ అక్కడి ల్యాబ్, ఆస్పత్రుల సాంకేతిక నిపుణుల నైపుణ్యంపై నమ్మకం లేకపోతే.. ప్రభుత్వ పథకమైన ఆరోగ్యశ్రీ సేవలకు ఎందుకు అనుమతించారని సూటిగా ప్రశ్నించింది.
కరోనా సేవల కోసం ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్లు ఐసీఎంఆర్ కు దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. దరఖాస్తు చేసుకున్న ఆస్పత్రులు, ల్యాబ్లను పరిశీలించిన అనంతరం ఐసీఎంఆర్ నోటిఫై చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఐసీఎంఆర్ ఆమోదించిన ఆస్పత్రుల్లోనే కరోనా చికిత్సలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.