సమైక్యతా దినోత్సవం: రేపు స్కూల్స్, ఆఫీసులకు సెలవు, సీఎస్ ఉత్తర్వులు
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం సమైక్యతా దినోత్సవం నిర్వహిస్తోంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. దేశంలో హైదరాబాద్ విలీనమైన సందర్భాన్ని తెలంగాణ సమైక్యతా దినోత్సవం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సర్కారు భారీ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 17ను సెలవు దినంగా ప్రకటించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్ ఆదేశాలతో రేపు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు క్లోజ్ అవుతాయి.
సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ నెల 16వ తేది నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి.
ఇటు 17వ తేదీ శనివారం, ఆ మరునాడు ఆదివారం సెలవు.. ఆ తర్వాత 6 రోజులు స్కూల్స్ నడుస్తాయి. తర్వాత 26వ తేదీ నుంచి 15 రోజుల పాటు దసరా సెలవులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ వారం రోజుల్లోనే.. విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు.