మోడీకి దగ్గర పడింది.. ఇక ఇంటికే, టీఆర్ఎస్ మంత్రుల వార్నింగ్
యాసంగి పంట కొనుగోలు కోసం టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపడుతున్నాయి. ఆయా చోట్ల మంత్రులు కూడా పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతున్నారు. ప్రధాని మోడీని ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డాయని వారు అంటున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరిసస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు నిరసనలు చేపట్టాలని కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్ దండు కదిలింది. గ్యాస్, పెట్రోల్ డబ్బాలతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మోడీ డౌన్.. డౌన్ అనే ప్ల కార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.
మంత్రుల నిరసన...
బేగంపేట చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ కార్యాలయం ముందు గురువారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హోం మంత్రి మహమూద్ ఆలీ, ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు భారీగా పెంచింది.. దీని ప్రభావం నిత్యావసరాల పైన పడుతుందని అన్నారు.
దేశలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఎనిమిదేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ పార్టీ అమలు చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం 150 పథకాలు తీసుకొచ్చిందని.. కేంద్రం ఒక్కటి కూడా తెలేదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మటం తప్ప వేరే ఏమీ చేయడం లేదన్నారు.
మంత్రులను అలా అనొచ్చా..
దేశంలో వరి ధాన్యం కొనుగోలు చేయమంటే చేయలేదు.. పని లేదా అంటూ కేంద్ర మంత్రులు మంత్రులను ఉద్ధేశించి అంటున్నారని, మతాలను అడ్డం పెట్టుకొని, రాజకీయాలు చేస్తోంది బీజేపీ పార్టీయేనని ఆరోపించారు. పేదలను దృష్టిలో ఉంచుకొని అనేక పథకాలు తెలంగాణ అమలు చేస్తోందనే విషయాన్ని గుర్తుచేశా0రు. ప్రశ్నిస్తే ఈడీలు, సీబీఐ దాడులు చేయిస్తోందని మండిపడ్డారు.
ఎందుకీ వివక్ష
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు కూడా మండిపడ్డారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు. ఎఫ్సీఐ ద్వారా పంటను కొనుగోలు చేయాలని రాజ్యాంగంలో ఉందన్నారు. గతంలో ప్రధానులుగా చేసిన చాలా మంది వడ్లు కొనుగోలు చేశారని, మోడీ ప్రభుత్వం మాత్రం వడ్లు కొనబోమని మొండికేస్తోందని దుయ్యబట్టారు. పంజాబ్లో వడ్లు కొంటున్నప్పుడు తెలంగాణలో కూడా కొనాలని ఢిల్లీలో మన ఎంపీలు కొట్లాడుతున్నారని, పంజాబ్కు ఒక న్యాయం, తెలంగాణకు ఇంకో న్యాయమా? అని ప్రశ్నించారు. సిద్ధిపేటలోని ఓ ఫంక్షన్ హాల్ లో వడ్లు కొనేందుకు టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగిన సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు.
బీజేపీ ఉచిత కరెంట్ ఇస్తోందా..?
బీజేపీ రైతు వ్యతిరేక విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని హరీశ్ రావు చెప్పారు. రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చిందని తెలిపారు. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని గుర్తుచేశారు. బీజేపీ పాలించే ఏ రాష్ట్రంలో కూడా రైతులకు ఉచిత విద్యుత్ లేదని చెప్పారు. వడ్లు కొనుగోలు చేయాలని ప్రతి గ్రామంలో ఏకగ్రీవ తీర్మానం చేసి మోడీకి పంపించాలని సూచించారు.