వైఎస్సార్ అడుగు జాడలో రేవంత్ రెడ్డి- యాత్ర పేరుతో..!!
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో సంక్షోభం మరింత ముదిరింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించడంతో పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధిష్ఠానం ఇటీవలే నియమించిన పోస్టులు.. పార్టీలో చిచ్చు పెట్టినట్టే కనిపిస్తోంది. ఇటీవలే పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు తాజాగా మరి కొందరు సీనియర్ నాయకులు అదే బాట పట్టారు.

ప్రాధాన్యత లేని పదువులు..
ఈ మధ్యే ఏఐసీసీ.. కొత్తగా టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో సభ్యురాలిగా కొండా సురేఖను నియమించారు. దాన్ని ఆమె తిరస్కరించారు. ఓ సాధారణ సభ్యురాలిగా తనను అపాయింట్ చేసి, అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాన్ని తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాకూర్కు పంపించారు. కమిటీల నియామకంలో సీనియారిటీని పరిగణలోకి తీసుకోలేదని కొండా సురేఖ వాదన.

సీతక్క సహా..
ఎమ్మెల్యే సీతక్క సహా కాంగ్రెస్ పార్టీకి 12 మంది రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను మాణిక్కం ఠాకూర్కు పంపించారు. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో సీతక్క ములుగు నియోజక వర్గం నుంచి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వేం నరేందర్ రెడ్డి, విజయరామారావు, చారకొండ వెంకటేష్, ఎర్ర శేఖర్, పటేల్ రమేష్, సత్తు మల్లేష్, దొమ్మాటి సాంబయ్య, జంగయ్య యాదవ్, కే సత్యనారాయణ, సుభాష్ రెడ్డి, చిలుక మధుసూదన్ రెడ్డి, శశికళ యాదవ రెడ్డి ఉన్నారు. వారంతా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్కు వలస వచ్చిన నాయకులే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

రేవంత్ రెడ్డి పాదయాత్ర..
ఈ పరిణామాల మధ్య రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. 2023 జనవరి 26వ తేదీన ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. జూన్ 2వ తేదీ వరకు కొనసాగుతుంది. అన్ని జిల్లాల మీదుగా సాగనుందీ పాదయాత్రం. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దీనికి శ్రీకారం చుట్టబోతోన్నారాయన. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రావడం అనే ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

యాత్ర పేరుతో..
ఈ పాదయాత్ర పోస్టర్, లోగోను కూడా ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి. యాత్ర అని పేరు పెట్టారు. ఇదే టైటిల్తో ఇదివరకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర మీద బయోపిక్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. కాగా- ఇప్పటికే తెలంగాణలో బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్, వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రలను నిర్వహిస్తోన్నారు.

దిద్దుబాటు..
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో- తలెత్తిన ఈ సంక్షోభ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టినట్టయింది. ఒక్కొక్క నాయకుడు రాజీనామా బాట పట్టడం, అదే సమయంలో భారతీయ జనతా పార్టీలో చేరాలంటూ ఆహ్వానాలు అందుతోండటం.. కలవరపాటుకు గురి చేస్తోంది అధిష్ఠానానికి. దీనితో దిద్దుబాటు చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications