తెలంగాణ సచివాలయం ఇక ఫోటో ప్రదర్శనలకే..! కార్యకలాపాలకు నేడే చివరి రోజు..!!
Recommended Video
హైదరాబాద్ : ప్రభుత్వ పాలనకు కేంద్రబిందువైన సచివాలయం ఆనవాలు నేటితో కాలగర్బంలో కలిసిపోనున్నాయి. ఇక మీదట సచివాలయ ఆకృతులను ఫోటోల రూపంలో మాత్రమే చూసే అవకాశం ఉంది. నేటి తో శాఖల తరలింపు కార్యక్రమాన్ని పూర్తిచేసి సచివాలయ భవంతులను ఖాళీ చేయాలని సీఎం చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేయడంతో అదికారులు తరలింపు పనులను వేగవంతం చేసారు. శాఖలను అందుకు సంబందించిన ఫైళ్లు వేగవంతంగా బూర్గుల రామకృష్ణ రెడ్డి భవనానికి తరలిస్తున్నారు. దీంతో ఎందరో ముఖ్యమంత్రులను, ఎన్నో ప్రభుత్వాలను చూసిన సచివాలయం నేటితో చరిత్రగా మారనుంది.
తెలంగాణ సచివాలయం..! ఇక మీదట ఓ మధుర జ్ఞాపకం..!!
తెలంగాణ సచివాలయంలోని శాఖల తరలింపు క్లైమాక్స్కు చేరింది. శాఖల తరలింపు ఆలస్యం చేయవద్దని సీఎం చంద్రశేఖర్ రావు ఆదేశించడంతో తరలింపు ప్రక్రియ జోరందుకుంది. మెజార్టీ శాఖలు సెక్రటేరియట్ నుంచి తరలిపోయాయి. ఇప్పటికే ఆర్ అండ్ బీ, రవాణా శాఖలకు ఎర్రమంజిల్కు షిఫ్ట్ అయ్యాయి. నేటి నుంచి సెక్రటేరియట్ కార్యకలాపాలు అన్నీ... బీఆర్కే భవన్ కేంద్రంగా కొనసాగనున్నాయి. కొత్త సచివాలయ నిర్మాణం పూర్తయ్యేవరకు, బూర్గుల రామకృష్ణ రెడ్డి భవన్, తెలంగాణ సచివాలయంగా కొనసాగనుంది. అక్కడి నుంచే మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కార్యాలయ కార్యకలాపాలు మొదలయ్యాయి.
నేటితో ఖాళీ కానున్న సెక్రటేరియట్..! శాఖల తరలింపుకు నేడే చివరి రోజు..!!
సచివాలయం నుంచి శాఖల తరలింపుపై జరిగిన సమీక్షలో సీఎం చంద్రశేఖర్ రావు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తక్షణమే తరలింపు ప్రారంభించాలని ఆదేశించారు. దీంతో అధికారులు ఆఘమేఘాలమీద షిఫ్టింగ్ చేపట్టారు. సీబ్లాక్లో ఉండే సీఎస్ ఎస్కే జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అధిర్ సిన్హాతోపాటు విద్యుత్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్శర్మ కార్యాలయాలు బీఆర్కే భవన్కు వాయువేగంతో తరలిపోయాయి.
ఆసల్యం చేయొద్దన్న సీఎం..! అప్రమత్తమైన అదికారులు..!!
బీఆర్కే భవన్లో నేటి నుంచి సచివాలయ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. శ్రావణమాసం, అదీ శుక్రవారం కావడంతో జీఏడీశాఖ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో బీఆర్కే భవన్ నుంచి కొనసాగించాలని సీఎస్ జోషి ఆదేశించారు. ఇక మిగిలిన శాఖలకు సంబంధించిన ముఖ్య అధికారుల కార్యాలయాలను అన్నీ బీఆర్కేకు షిప్ట్ చేస్తున్నారు. మిగిలిన వస్తువులు ఏమైనా ఉంటే వాటి తరలింపును రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని జీఏడీ అధికారులు నిర్ణయించారు. వరుస సెలవులతో శాఖల తరలింపుకు ఇబ్బందులు కలుగకుండా ఉద్యోగులకు సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో శాఖల తరలింపు ఊపందుకున్నట్టు తెలుస్తోంది.
ఇక సచివాలయం ఓ చరిత్ర..! అదే ప్రాంగణంలో కొత్త భవంతులు..!!
మొత్తానికి జూలై 15 నాటికే సచివాలయ తరలింపు పూర్తి చేయాలని మొదట భావించినప్పటికీ, బూర్గుల రామకృష్ణ రెడ్డి భవన్లోని శాఖల తరలింపు, మరమ్మతుల కారణంగా ఆలస్యమైంది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కావడానికి వీల్లేదని చంద్రశేఖర్ రావు ఆదేశించడంతో, అధికారులు ఆఘమేఘాల మీద తరలింపు చేపట్టారు. దీంతో కొంత్త భవంతుల నిర్మాణానికి ప్రధాన అడ్డింకి తొలగినట్టైందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు భావించినట్టు అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలో సచివాలయం భవంతుల ప్రాంగణంలో కొత్త భవంతులు వెలిసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.