కైకాల సత్యనారాయణ కన్నుమూత..!!
తెలుగు సినీ పరిశ్రమ మరో ప్రముఖుడిని కోల్పోయింది. సీనియర్ నటుడు కైకాల సత్యానారాయణ (87) కన్నుమూశారు. చాలా కాలంగా కైకాల అనారోగ్యంతో ఉన్నారు. 777 సినిమాల్లో కైకాల నటించారు. చాలా రోజులుగా అనారోగ్యం కారణంగా నటనకు కైకాల దూరంగా ఉన్నారు. గతంలో కైకాల కోవిడ్ బారిన పడ్డారు. సుదీర్ఘ కాలం చికిత్స పొందారు. మెగాస్టార్ చిరంజీవి పలు సందర్భాల్లో కైకాలకు పరామర్శించారు. ఆయన తిరిగి ఆరోగ్యంతో కోలుకుంటారని ఆకాంక్షించారు. ఈ ఉదయం ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో కైకాల తుది శ్వాస విడించారు.
1935 జూలై 25న కైకాల జన్మించారు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలకు న్యాయం చేసారు. హాస్య, ప్రతినాయక, నాయక పాత్రలను పోషించారు. రేపు హైదరాబాద్ మహా ప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు జరగనున్నాయి. కైకాల స్వస్థలం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామం. ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యారు. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయంగానూ కైకాల రాణించారు. 1996 లో టీడీపీ నుంచి గుడివాడ ఎంపీగా గెలుపొందారు. కైకాల అనేక అవార్డులు, పురస్కారాలు సొంతం చేసుకున్నారు.

కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం సిపాయి కూతురు కాగా, చివరి చిత్రం మహర్షి. 200 మందికి పైగా దర్శకులతో కైకాల పని చేసారు. ఎన్టీఆర్ అగ్గిపిడుగు చిత్రంతో కైకాల సినీ జీవితం మలుపు తిరిగింది.ఎన్టీఆర్ తో కలిసి 101 చిత్రాల్లో కైకాల సత్యనారాయణ నటించారు. రాముడు-భీముడు వంటి ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయ చిత్రాలలో ఆయనకు డూప్ గా తన సామర్ధ్యం నిరూపించుకున్నారు. 2017లో జీవన సాఫల్య పురస్కారం దక్కించుకున్నారు. కైకాల నటించిన బంగారు కుటుంబంకు నంది అవార్డు దక్కింది. కైకాల మరణంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇదే ఏడాది క్రిష్ణంరాజు, క్రిష్ణ వంటి వారిని కోల్పోయిన తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు మరో పెద్ద దిక్కును కోల్పోయింది.












Click it and Unblock the Notifications