సంక్రాంతి తరువాత కొత్త సచివాలయం నుంచి పరిపాలన..!!
హైదరాబాద్: కొత్తగా రూపుదిద్దుకుంటోన్న కొత్త సచివాలయ భవనం.. త్వరలో అందుబాటులోకి రానుంది. సంక్రాంతి తరువాత ఈ భవనంలో నుంచి కార్యకలాపాలను సాగించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నాహాలు చేస్తోన్నారు. వచ్చే సంవత్సరం జనవరి 18వ తేదీన ఇక్కడి నుంచి ఆయన పరిపాలన సాగించేలా ముహూర్తం ఖాయం చేశారు. ఈలోగా నిర్మాణ పనులన్నింటినీ పూర్తి అయ్యేలా చూడాలంటూ సంబంధిత అధికారులను సూచించారు.
కొత్త సచివాలయం ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి ఛాంబర్ను ఉంటుంది. జనవరి 18వ తేదీన ఈ ఛాంబర్లో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం కేసీఆర్ బాధ్యతలను స్వీకరించనున్నారు. అదే రోజున కొన్ని ప్రధాన శాఖలకు చెందిన మంత్రులు కూడా బాధ్యతలను స్వీకరించే అవకాశాలు లేకపోలేదు. సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తాన్ని ఖాయం చేసినందున ఇక నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి.
ఇదివరకు ఉన్న పాత సచివాలయ ప్రాంగణంలోనే దీన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. పాత సచివాలయం ప్రాంగణం మొత్తాన్ని తొలగించి అక్కడే సుమారు ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనాన్ని నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అధునాత పద్ధతుల్లో ఈ భవనం నిర్మితమౌతోంది. షాపూర్జీ పల్లోంజీ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. సచివాలయం ప్రాంగణంలో 650 కార్లు, 500 స్కూటర్లు ఒకేసారి పార్కింగ్ చేయవచ్చు. బ్యాంక్, పెట్రోల్ బంక్, ప్రభుత్వ క్లినిక్, మెస్.. ఇందులో అందుబాటులో ఉంటాయి.
వాస్తుకు అనుగుణంగా సచివాలయ కాంప్లెక్స్ నిర్మాణం జరుపుకొంటోంది. నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. పనులను వేగవంతం చేయాల్సి ఉంటుందని కాంట్రాక్ట్ సంస్థ షాపూర్జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధులకు సూచించారు. వచ్చే సంవత్సరం జనవరి 18వ తేదీ నాటికి పూర్తి సచివాలయ కాంప్లెక్స్ అందుబాటులోకి తీసుకుని వచ్చేలా నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని పేర్కొన్నారు. ఆరో అంతస్తుకు సంబంధించిన పనులు ముందుగానే ముగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.