హైదరాబాద్లో భారీ వర్షం, కొట్టుకుపోయిన వాహనాలు: కుషాయిగూడలో కుంగినరోడ్డు
హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడలో రోడ్డు కుంగిపోయిన ఘటన కలకలం రేపింది. అందరూ చూస్తుండగానే.. అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోయింది. దీంతో అక్కడ భారీ గొయ్యి ఏర్పడింది. కుషాయిగూడలోని ఏఎస్ రావునగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఒక్కసారిగా కుంగిన రోడ్డు.. భారీ గొయ్యి..
రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయి భారీ గొయ్యి ఏర్పడటంతో వెంటనే ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. స్థానికులు, ప్రయాణికులు ఏం జరిగిందోనని ఆందోళనలకు గురయ్యారు. ఈ గొయ్యి కారణంగా వాహనదారులు ప్రమాదానికి గురికాకుండా చర్యలు చేపట్టారు పోలీసులు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు..
సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు.. కుంగిపోయిన రోడ్డును బాగు చేసే పనిలో నిమగ్నమయ్యారు. రోడ్డు కుంగిపోయిన సమయంలో వర్షం కురవకపోవడం, ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో నగరంలోని రోడ్లు అధ్వాన్నంగా మారిపోయాయి.
హైదరాబాద్లో భారీ వర్షం.. వరదలో కొట్టుకుపోయిన వాహనాలు
మరోవైపు మంగళవారం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. బుధవారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయంగా మారాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు కూడా నీటమునిగాయి. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి పలు చోట్ల పార్కింగ్ చేసిన వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి.
భారీ వర్షంతో నగరవాసిక తీవ్ర ఇబ్బందులు
నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్ బాగ్, మెహదీపట్నం, అత్తాపర్, షేక్పేట, అఫ్జల్ గంజ్, దిల్సుఖ్నగర్, సరూర్నగర్, వనస్థలిపురం, మలక్పేట, సైదాబాద్, చంపాపేట్, నారాయణగూడ, హిమాయత్నగర్, ట్యాంక్ బండ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, ముషీరాబాద్, సికింద్రబాద్, తార్నాక, ఉప్పల్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లోనూ మంగళవారం భారీ వర్షం కురిసింది. కరోనా మహమ్మారి కారణంగా హైదరాబాద్ నగరాన్ని విడిచి వెళ్లిన వారంతా కూడా ఇప్పుడిప్పుడే తిరిగి చేరుకుంటుండటంతో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద భారీగా రద్దీ పెరిగిపోయింది.