కొలువుదీరిన ఖైరతాబాద్ గణేశుడు: దేశంలోనే అరుదైన గుర్తింపు(పిక్చర్స్)
హైదరాబాద్: వినాయక చవితి పండగ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తుకు వచ్చేది నగరంలోని ఖైరతాబాద్ గణేశుడే. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ గణేశుడి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న రాష్ట్రాల ప్రజలు కూడా వస్తారు. దాదాపు ఆరు దశబ్దాలకుపైగా ఈ వినాయకుడు ఇక్కడ కొలువుదీరి భక్తులను ఆశీర్వదిస్తున్నాడు.
అరుదైన గుర్తింపు
ప్రతీ సంవత్సరం ప్రత్యేక రూపంలో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. కాగా, ప్రస్తుతం దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా ఖైరతాబాద్ గణేశుడు అరుదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది 61 అడుగుల ఎత్తులో ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా దర్శనమిస్తున్నారు. 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో.. 61 అడుగుల ఎత్తులో కొలువుదీరాడు.
ద్వాదశ ఆదిత్య మహా గణపతి
వినాయకుడి కుడి వైపున మహా విష్ణువు, ఏకాదశి దేవి ఉండగా.. ఎడమ వైపున బ్రహ్మా, విష్ణు, మహేశ్వర సమేత దుర్గాదేవి కొలువుదీరారు. ఒక్కో తలకు ఒక్కో రంగు వేసి సుందరంగా రూపుదిద్దారు. కాగా, ఈ రూపంలో వినాయకుడ్ని పూజిస్తే సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు బాగుంటాయని, అందరికీ మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
ఈ ఏడాది మాత్రం..
ఖైరతాబాద్ గణేశుడి ప్రాశస్త్యాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే.. 1954లో తొలిసారిగా ఖైరతాబాద్లో ఈ గణేశుడు కొలువుదీరాడు. అప్పట్నుంచి ఏడాదికి ఒక అడుగు చొప్పున పెంచుతూ వచ్చారు. 2014 నాటికి 60 అడుగులకు చేరడంతో.. ఒక్కో అడుగునూ తగ్గించుకుంటూ వచ్చారు. అయితే, ఈ ఏడాది మాత్రం 61 అడుగుల మహాగణపతిని ఏర్పాటు చేశారు. సుమారు కోటి రూపాయల ఖర్చుతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రతోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన 150మంది నాలుగు నెలలపాటు శ్రమించి ఈ విగ్రహాన్ని పూర్తి చేశారు.
నేటి నుంచే భక్తులకు దర్శనం
వినాయక చవితి సందర్భంగా సోమవారం ఉదయం ఖైరతాబాద్ గణేశుడి తొలి పూజ అందుకోనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. 11 రోజులపాటు కొలువై ఉండనున్న ఈ గణనాథుడిని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు.
లడ్డూ ప్రత్యేకమే..
ఖైరతాబాద్ గణేశుడికి పెట్టే లడ్డూ కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంకు చెందిన సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణేశుడికి లడ్డూను సమర్పిస్తారు. ఈసారి కూడా ఆయనే లడ్డూను సమర్పించనున్నారు. ఈ ఏడాది 6వేల కిలోల లడ్డూను తయారుచేసిన ఖైరతాబాద్ గణేశుడుకి సమర్పించాలని నిశ్చయించుకున్నట్లు తెలిసింది. ఆ లడ్డూను గణనాథుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు పంచనున్నారు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు.