ఈ సారి మన గణనాధుడు 61 అడుగులు..! శ్రీద్వాదశాదిత్య మహాగణపతిగా నామకరణం..!!
ఖైరతాబాద్/హైదరాబాద్: ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవాలను ఈసారి కూడా అంతే ఘనంగా నిర్వహించేందుకు మహానగర గణేష్ ఉత్సవసమితి ఏర్పాట్లు చేస్తోంది. ఏటా నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేకత చాటే ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది సరికొత్త రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 12 తలలతో 'శ్రీద్వాదశాదిత్య మహాగణపతి' నామంతో కొలువు దీరనున్నారు. విగ్రహ నమూనాను మంగళవారం ఖైరతాబాద్లోని వినాయక మండపం వద్ద ఉత్సవ కమిటీ ఛైర్మన్ సింగరి సుదర్శన్, శిల్పి రాజేంద్రన్ తదితరులు విడుదల చేశారు.
ఏటా దివ్యజ్ఞాన సిద్ధాంతి (విఠలశర్మ) సూచనలతో విగ్రహ నమూనాతోపాటు నామకరణం చేస్తారు. ఈ ఏడాది సైతం ఆయన సూచనలతో గణనాథుడికి నామకరణం చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. ఇప్పటివరకు విగ్రహం ఎత్తు 60 అడుగులే గరిష్ఠం కాగా.. ఈ సారి 61 అడుగులు ఉండనుంది. 'శ్రీద్వాదశాదిత్య మహాగణపతి' విగ్రహం వెడల్పు 28 అడుగులు.

వినాయకుడిని తొలిసారిగా 12 తలలతో తయారుచేస్తున్నారు. కుడి, ఎడమల్లో ఐదేసి తలల్ని రూపుదిద్దడంతోపాటు ప్రధాన తల పైభాగంలోనూ మరో తలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 14 చేతులు ఉంటాయి. విగ్రహం పైభాగంలో 12 సర్పాలు, విగ్రహం కింది భాగం నుంచి మధ్య 20 అడుగుల ఎత్తులో ఏడు గుర్రాలు ఉంటాయి. అదే మండపంలో వినాయకుడి పక్కనే కుడివైపున మహావిష్ణువుతోపాటు ఏకాదశిదేవి విగ్రహం, ఎడమ వైపున మహాకాళితో పాటు త్రిమూర్తుల విగ్రహాలు ఉంటాయి.
ఏటా మహాగణపతి మండపానికి రెండు వైపులా మరో రెండు మండపాలను ఏర్పాటు చేసి ఇతర విగ్రహాలను ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది వినాయకుడికి కుడివైపున సిద్ధకుంజికాదేవి, ఎడమవైపున దత్తాత్రేయుల విగ్రహాలు కొలువుదీరనున్నాయి.












Click it and Unblock the Notifications