TRS20: నాటి ఫొటోలు పంచుకున్న కేటీఆర్, హరీశ్ రావు, నిప్పురవ్వగా కేసీఆర్..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) సోమవారం(ఏప్రిల్ 27)న 20వ వార్షికోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకుంది. కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని, గుంపులుగా చేరవద్దని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన పిలుపుమేరకు గులాబీ శ్రేణులన్నీ అలాగే చేశాయి.
ఆవిర్భావ రోజున..
ఈ సందర్భంగా వారం రోజులపాటు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతేగాక, మంత్రి కేటీఆర్ స్వయంగా ఆదివారం రక్తదానం చేయడం గమనార్హం. కాగా, సోమవారం టీఆర్ఎస్ ఆవిర్బావ వేడుకలను జరుపుకుంటున్న వేళ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఉద్యమ కాలంంనాటి ఫొటోలను పంచుకున్నారు.
ఉద్యమ కాలం నాడు..
ఉద్యమ ప్రస్థానంలో పలు కార్యక్రమాలు, ఆందోళనల్లో పాల్గొన్న ఫొటోలను, అరెస్టై పోలీస్ స్టేషన్లో ఉన్న ఫొటోలను అభిమానులు, కార్యకర్తలతో పంచుకున్నారు. ఉద్యమ కాలం నాటి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఫొటోలను కూడా పోస్టు చేశారు.
అద్భుతాలు ఆవిష్కరణ..
గత 20ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో టీఆర్ఎస్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రజలతో మమేకమై అద్భుతాలను ఆవిష్కరించిందని కేటీఆర్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రజాసేవకు పునరంకితం అవుతున్నట్లు చెప్పుచ్చారు. జలదృశ్యం నుంచి సుజల దృశ్యం వరకు అని అప్పట్నుంచి ఇప్పటి వరకు పలు పరిణామాలను గుర్తు చేసుకున్నారు.
మరో 15ఏళ్లు కేసీఆరే..
‘ప్రజా సేవకు పునరంకితం
-జలదృశ్యం నుంచి సుజల దృశ్యం వరకు
-జనం నాడి తెలిసిన సీఎం కేసీఆర్
-ఆరేళ్ళ పాలనలో 'ఐదు విప్లవాలు'
-దేశం చూపు తెలంగాణ వైపు..
పంచ విప్లవాల సృష్టికర్త కేసీఆర్
- జలదృశ్యం నుంచి సుజల దృశ్య ఆవిష్కారం
- ఈ విజయాలు ఆయన కృషి, పట్టుదలకు నిదర్శనం
- మరో 15 ఏళ్లు కేసీఆరే సీఎంగా ఉండాలన్నది ప్రజల కోరిక.. నాది కూడా' అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఉద్యమ సూర్యుడా వందనం..
‘ఒక్క పిడికిలి బిగిస్తే.. బిగుసుకున్నయ్ కోట్ల పిడికిల్లు
ఒక్క గొంతు జైకొడితే జంగు సైరనయ్యింది
స్పూర్తి ప్రదాతా వందనం.. ఉద్యమ సూర్యుడా వందనం'
అంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వందనం చేస్తున్నట్లు ఓ ట్వీట్ చేశారు కేటీఆర్. గులాబీ జెండా పుట్టిన రోజు పండగ సందర్భంగా ఉద్యమ బిడ్డలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్.
Recommended Video
ఉద్యమ నిప్పురవ్వగా..
‘ఒక సాహసం చరిత్ర గతిని మార్చింది
ఒక త్యాగం మరో చరిత్రను సృష్టించింది
కేసిఆర్ ఉక్కు సంకల్పం 60 ఏండ్ల కలను సాకారం చేసింది.
ఉద్యమం నిప్పురవ్వగా మోదలైనరోజులు తలుచుకుంటే మనసు గర్వంతో నిండిపోతుంది. ఉద్యమం దావానలమై లక్ష్యాన్ని ముద్దాడినప్పుడు జన్మధన్యమైన సంతృప్తి. 20యేళ్లుగా కేసిఆర్ గారి బాటలో నడుస్తున్న సైనికుడికి ఇదొక జీవిత కాల సాఫల్యం' అంటూ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications