ఢిల్లీ వైపు కేసీఆర్ చూపు.. దేశరాజధానిలో పార్టీ కార్యాలయం..! అప్పుడేనా ముహుర్తం?
హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న సీఎం కేసీఆర్.. ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం నిర్మించేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీనికోసం అనువైన ప్లేస్ ఎంపిక చేయడానికి కొందరు ఎంపీలు ఢిల్లీలోని కొన్ని ప్రభుత్వ స్థలాలు పరిశీలించనున్నట్లు సమాచారం. వీరితో పాటు తెలంగాణ వాస్తు ప్రముఖులు సుధాకర్ తేజ వెళ్లనున్నారు. అనంతరం కేసీఆర్ కూడా పరిశీలించి స్థలం ఓకే చేయనున్నారట.
ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో భేటీ అయిన సందర్భంలో అక్కడ టీఆర్ఎస్ కార్యాలయం నిర్మించుకోవడానికి స్థలం ఇవ్వాల్సిందిగా కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది. అయితే నిబంధనల ప్రకారం టీఆర్ఎస్ కు ఢిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మించుకోవడానికి 1000 గజాల ప్రభుత్వ స్థలం కేటాయించే ఛాన్సుంది.
ఈమేరకు ప్రభుత్వ స్థలంలో పార్టీ ఆఫీస్ నిర్మాణం చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ స్పీడప్ చేస్తున్న తరుణంలో ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఉంటే బాగుంటుందనేది ఆయన అంతరంగంగా కనిపిస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి తర్వాత శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు కార్యాలయం నిర్మాణం కూడా రెండు, మూడు నెలల్లో పూర్తి చేయాలని అనుకుంటున్నారట.