బిత్తిరి సత్తిని వాడేస్తున్న కేసీఆర్.. చేవెళ్ల సభతో ఎంట్రీ.. గులాబీ బాస్ పై సత్తి పాట, మాట
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడింది. పోలింగ్ కు మరో నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. అందులోభాగంగా స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించేందుకు తహతహలాడుతున్నాయి. ఈనేపథ్యంలో బుల్లితెర కామెడీ ట్రెండ్ సెట్టర్ బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవిని రంగంలోకి దించింది టీఆర్ఎస్ అధిష్టానం. చివరి నిమిషంలో ఆయనను వాడుకోవాలని డిసైడ్ అయిన గులాబీ పెద్దలు చేవెళ్ల సభలో ఆయనను తెరపైకి తెచ్చారు.
టీఆర్ఎస్ మొదటి జాబితా విడుదలయ్యాక అనూహ్యంగా బిత్తిరి సత్తి పేరు తెరపైకి వచ్చింది. మల్కాజిగిరి టీఆర్ఎస్ అభ్యర్థిగా సత్తి పోటీ చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేసీఆర్ ఆదేశాలతో ఎన్నికల బరిలో దిగుతున్నారనేది ఆ వార్త సారాంశం. చివరకు అవన్నీ గాలి వార్తలేనని తేలింది. అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బిత్తిరి సత్తికి టికెటివ్వకపోయినా.. ప్రచారంలో వాడుకోవాలని డిసైడ్ అయ్యారు గులాబీ పెద్దలు.

బిత్తిరి సత్తి టైమ్
తీన్మార్ వార్తల అమాయక చక్రవర్తి, బుల్లితెర కామెడీ కింగ్ బిత్తిరి సత్తికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అటు ఓ ఛానల్ లో పనిచేస్తూనే ఇటు ప్రైవేట్ షోలు, సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. టైమ్ మేనేజ్ మెంట్ ప్లాన్ చేసుకుంటూ తన కెరీర్ ను మలచుకుంటున్నారు. ఇలా బిజీబిజీగా ఉన్న సత్తి.. రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం దావానంలా వ్యాపించింది. సత్తి ఫ్యాన్ ఫాలోయింగ్.. కారు గుర్తుకు కలిసొచ్చేలా మంతనాలు జరుగుతున్నాయనే వార్త నెట్టింట్లో షికార్లు కొట్టింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయనను పిలిచి ఎమ్మెల్యే టికెటిస్తున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. కానీ అది జరగలేదు.

సారు పాలనే బెటర్..! సత్తి పాట, మాట
చేవెళ్ల పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న బిత్తిరి సత్తి ఏ పార్టీలను ప్రత్యక్షంగా విమర్శించకపోయినా.. తనకు జరిగిన అనుభవాలు పంచుకున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఆయన తండ్రి నర్సింలు పేరిట వచ్చే పెన్షన్ కోసం రెండు వందల సార్లు ప్రదక్షిణలు చేసినా రాలేదని గుర్తుచేశారు. అది వేరే నర్సింలుకు ఇచ్చారని వాపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చారు. పారదర్శకంగా ఎవరి బ్యాంకు అకౌంట్లలో వారికే నేరుగా పడుతుండటం గొప్ప విషయమన్నారు. కారు గుర్తుకు ఓటేస్తే అందరి బతుకులు బాగుపడతాయన్నట్లు మాట్లాడిన బిత్తిరి సత్తి.. చివరకు కేసీఆర్ ప్రసంగం ముగించి వెళ్లే సమయంలో ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ పై బిత్తిరి సత్తి ఓ పాట రూపొందించడం విశేషం. "తెలంగాణ నేల మీద వేద్దాము ఒట్టు.. కారుగుర్తుకేద్దాం ఓటు, గుండెమీద వేసి కేసీఆర్ పచ్చబొట్టు.. ఇంకోసారి గెలుపు పట్టు" అనే పాటను తన సొంత యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేశారు.

నో పొలిటిక్స్.. ఓన్లీ కామెడీ
టీఆర్ఎస్ టికెట్ మాట అటుంచితే.. అసలు ఆయనకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదంట. ఒకప్పుడు కెరీర్ కోసం నానా తిప్పలు పడ్డ బిత్తిరి సత్తి ఈ మూడు నాలుగేళ్ల కాలంలోనే బాగా పాపులయ్యారు. దీంతో కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఎక్కడ కూడా తప్పటడుగులు పడకుండా చూసుకుంటున్నారు. ఈక్రమంలో రాజకీయాలు, టీఆర్ఎస్ టికెట్ అంటూ తనపై వచ్చిన వార్తలను ఆయన ఖండించలేదు, స్వాగతించలేదు.

సత్తి ఎంట్రీతో పొలిటికల్ హీట్
ఒకవేళ టీఆర్ఎస్ పిలిచి టికెటిచ్చినా బిత్తిరి సత్తి సున్నితంగా తిరస్కరించేవారేమో. ఆయన కెరీర్ క్యాలికులేషన్ జాగ్రత్తగా గమనిస్తే ఇదే విషయం బోధపడుతుంది. బిత్తిరి సత్తి రాజకీయాల జోలికి వెళ్లకపోయినా.. ప్రచారానికి మాత్రం సై అన్నట్లు సమాచారం. మొత్తానికి ఎన్నికల పర్వం ప్రారంభం నుంచి ఆచితూచి అడుగులేస్తున్న టీఆర్ఎస్ చివరి నిమిషంలో బిత్తిరి సత్తిని రంగంలోకి దించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపికయింది. అదలావుంటే ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉండటంతో బిత్తిరి సత్తిని మళ్లీ టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దించుతారేమోననే ఊహగానాలు జోరందుకున్నాయి.












Click it and Unblock the Notifications