హుజురాబాద్ బై పోల్: ఈటలపై ఎస్ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు.. ఇదీ కారణం..
హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ చివరి దశకు చేరుకుంది. మరికొద్దీ నిమిషాల్లో పోలింగ్ ముగియనుంది. అయితే బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారని, ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.
నియోజకవర్గ ప్రజలు తమవైపే ఉన్నారని, ప్రజల ఆశీస్సులు తనకే ఉన్నాయని ఓటర్లను ప్రభావితం చేసేలా కామెంట్స్ చేశారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఈటల రాజేందర్ భార్య అసత్య ప్రచారం చేస్తున్నారని కూడా వారు ఎన్నికల సంఘానికి నివేదించారు. ఈటల రాజేందర్ దంపతులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ స్పందించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటింగ్ నేపథ్యంలో ఇప్పటివరకు 88 ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. ఆయా ఫిర్యాదులపై ఎన్నికల పరిశీలకులు వివరాలు సేకరిస్తున్నారని ఆయన చెప్పారు. నిజానిజాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇటు హుజురాబాద్లో పోలింగ్ ఎక్కువగానే జరుగుతుంది. 70 నుంచి 80 శాతం వరకు ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. పోలింగ్ వేళ చెదురు మదురు ఘటనలు కూడా జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్వగ్రామం హిమ్మత్ నగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. హిమ్మత్ నగర్కు బీజేపీ నేత తుల ఉమా రావడాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా తప్పు పట్టారు. పోలింగ్ కేంద్రానికి నాన్ లోకల్స్ ఎలా వస్తారంటూ అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. టీఆర్ఎస్ నేతల ఆందోళనకు పోటీగా బీజేపీ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. .వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇరు వర్గాలను చెదరగొట్టారు.