ముందంజలో 'బీటీ' బ్యాచ్..! వెనుకబడ్డ 'యూటీ' బ్యాచ్?.. పదవుల కోసం టీఆర్ఎస్లో కొత్త ''టెస్ట్''
హైదరాబాద్ : తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీలో "పదవుల" పంపకం పలువుర్ని ఊరిస్తోంది. పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తల నుంచి మొన్నటి ఎన్నికల దాకా చెమటోడ్చిన నేతల వరకు "ప్రమోషన్" పై ఆశలు పెట్టుకున్నారు. అయితే తెలంగాణ ఉద్యమం తొలినాళ్ల నుంచి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న "UT" బ్యాచ్ కు సముచిత స్థానం లభిస్తుందా? లేదంటే ఇప్పటికిప్పుడు పార్టీలో చేరిన "BT" బ్యాచ్ కు పెద్దపీట వేస్తారా? అనేది చర్చానీయాంశంగా మారింది.
పదవులెవరికో..!
ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం సాధించి తొలిసారిగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అమలుచేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయి. దీంతో రెండోసారి బంపర్ మెజార్టీతో అధికార పగ్గాలు అప్పగించారు ప్రజలు. అయితే టీఆర్ఎస్ ప్రస్థానంలో కొందరు కార్యకర్తలు, నేతలు అంకితభావంతో పనిచేసినప్పటికీ.. తొలి ప్రభుత్వంలో వారికి సరైన న్యాయం దక్కలేదనే వాదనలున్నాయి.
దీంతో రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో పదవులపై చాలామంది ఆశలు పెంచుకున్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ.. ఇలా ప్రతి పదవికి ఆశావహులు పెరిగిపోయారు. ఈనేపథ్యంలో టీఆర్ఎస్ పదవుల పంపకం ఆసక్తికరంగా మారింది. ప్రమోషన్ లో ఎవరికి ప్రాధాన్యత దక్కనుంది? "UT" బ్యాచ్ కా? "BT" బ్యాచ్ కా? అనే టాక్ నడుస్తోంది.
కేసీఆర్కు నై...చంద్రబాబుకు జై : బాబు చెంతకు దూతను పంపిన ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్
పదవుల పందేరం.. ఆశల పల్లకి
సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించనుండటంతో రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఒక వాదన. రాష్ట్ర సారథిగా ఆయన తనయుడు కేటీఆర్ కు పగ్గాలు అప్పగిస్తారనే టాక్ వైరల్ గా మారింది. ఈనేపథ్యంలో పదవులన్నీ కూడా కేటీఆర్ వీరవిధేయులకే దక్కుతాయనే ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఆయనకు అనుగుణంగా ఉన్నవారినే పదవులు వరిస్తాయనేది ఒక అంచనా. ఈక్రమంలో బంగారు తెలంగాణ బ్యాచ్ నేతలకు అధిక ప్రాధాన్యం దక్కనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఉద్యమ బ్యాచ్ లీడర్ల పరిస్థితేంటనే గుసగుసలు జోరందుకున్నాయి.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టాక జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు కేటీఆర్. వారం పది రోజుల్లో ఉమ్మడి జిల్లాలు మొత్తం చుట్టివస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మాత్రమే పర్యటించారు. ఆ తర్వాత దాదాపు వారం రోజుల పాటు ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన ఎక్కడకు వెళ్లారు.. ఏదైనా స్ట్రాటజీ ప్లే చేస్తున్నారా? తదితర ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. మరోవైపు అండర్ గ్రౌండ్ లో పదవుల పందేరంపై కసరత్తు చేశారనేది మరో కోణంగా తెలుస్తోంది. అదలావుంటే గురువారం కేటీఆర్ పార్టీ కార్యాలయానికి వస్తున్నారని తెలిసి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు వచ్చి కలిసినట్లుగా సమాచారం. వీరంతా కూడా కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారా? లేదంటే మంత్రివర్గంలో బెర్త్ కోసం కలిశారా? అన్నది సస్పెన్స్ గా మారింది.
ఇంతకు ఏ బ్యాచ్కి ప్రాధాన్యం..!
కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. రాజకీయ సమీకరణాలు మారే అవకాశముందా? ఇలాంటి అంశాలన్నీ కూడా కేసీఆర్ పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. అందుకే క్షేత్రస్థాయి పదవుల నుంచి రాష్ట్రస్థాయి పదవుల దాకా.. కేటీఆర్ వీర విధేయులకే పట్టం కట్టాలని ఆయన అంతరంగంగా తెలుస్తోంది.
అయితే ఉద్యమం నుంచి పార్టీనే నమ్ముకుని పార్టీకోసమే పనిచేస్తూ పార్టీకోసమే జీవిస్తున్న కార్యకర్తలు, నేతలకు (ఉద్యమ బ్యాచ్) ప్రాధాన్యమిస్తారా? లేదంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పార్టీ అధికారంలోకి వచ్చాక బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలకు ఆకర్షితులమయ్యామని చెబుతూ అనూహ్యంగా గులాబీ తీర్థం పుచ్చుకున్న (బంగారు తెలంగాణ బ్యాచ్) నేతలకు అవకాశమిస్తారా అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి కేటీఆర్ వీరవిధేయులెవరో గుర్తించడానికి ఎలా టెస్ట్ చేస్తారో చూడాలి.