రైతుల ముసుగులో దాడి చేసే ప్లాన్, రాళ్ల దాడులు కూడా భరిస్తాం: బండి సంజయ్
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. యాసంగి పంట కొనుగోలుపై ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ పీక్కి చేరింది. సీఎం కేసీఆర్ లక్ష్యంగా బీజేపీ నేతలు అటాక్ చేస్తుంటే.. బండి సంజయ్, బీజేపీ టార్గెట్కు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. మరోవైపు గురువారం నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టబోతున్నారు. యాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నారని సంజయ్ ఆరోపించారు.

ప్రజా సంగ్రామ యాత్ర
ఈ నెల 14వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను బండి సంజయ్ ప్రారంభిస్తారు. మంగళవారం తెలంగాణ బీజేపీ రాష్ట్ర పదాధికారులతో బండి సంజయ్ సమావేశం అయ్యారు. యాత్ర సాగే విధానంపై వారిపై చర్చించారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని వివరించారు. రైతుల ముసుగులో దాడులు చేయించి, బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా అధికార పార్టీ నేతలు స్కెచ్ వేశారని సంజయ్ ఆరోపించారు.
రాళ్ల దాడులను భరిస్తాం..
తెలంగాణ ప్రజల కోసం రాళ్ల దాడులను భరించేందుకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. దాడి జరిగినా.. బీజేపీ కార్యకర్తలు ఎదురుదాడి చేయకుండా సంయమనం పాటిస్తారని తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టేందుకు సీఎం కేసీఆర్ పన్నాగం పన్నారని మండిపడ్డారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగించి తీరుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కుటుంబ పాలనను ప్రజల వద్ద ఎండగడతామని సంజయ్ చెప్పారు. రైతుల కోసం ఢిల్లీలో దీక్షకు దిగిన కేసీఆర్..గంటసేపు కూడా చేయలేకపోయారని మండిపడ్డారు.

ఇక్కడినుంచి యాత్ర
బండి సంజయ్ నేతృత్వంలో ఏప్రిల్ 14వ తేదీప జోగులాంబ గద్వాల్ జిల్లాలో రెండో విడత 'ప్రజా సంగ్రామ యాత్ర' ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే బీజేపీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎంపీ సోయం బాపూరావు, మాజీ మంత్రులు విజయరామారావు, జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి, జి వివేక్ వెంకటస్వామి, ఏపీ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications