నలుగురు మహిళల మృతి సాధారణం కాదంటూ గవర్నర్ తమిళిసై: నిమ్స్లో పరామర్శ
హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ( కు.ని) ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు చనిపోవడమనేది సాధారణ విషయం కాదని, ఇది ఆమోద యోగ్యం కాదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. దీనిపై విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చాక పూర్తి కారణాలు తెలుస్తాయన్నారు.
నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను గవర్నర్ పరామర్శించారు. వారి బాగోగులను అడిగితెలుసుకున్నారు. చికిత్స సమయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా అని ఆరా తీశారు. చికిత్స పొందుతున్న 11 మంది బాధితులకు గవర్నర్ తమిళిసై ఆర్థిక సాయం ప్రకటించారు. గవర్నర్ నిధుల నుంచి రూ.10వేల చొప్పున సాయం అందిస్తునట్టు వెల్లడించారు.

బాధితులకు పండ్లు పంపిణీ చేసిన గవర్నర్ మెరుగైన వైద్యాన్ని అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు.
వేగంగా ఎక్కువ మందికి శస్త్రచికిత్సలు చేయాలనే లక్ష్యమే ఇబ్రహీంపట్నంలో కు.ని ఆపరేషన్లు వికటించటానికి కారణంగా భావిస్తున్నట్టు గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ పేర్కొన్నారు.
ఈ ఘటనపై విచారణ పూర్తైన తర్వాత అసలు కారణాలు తెలుస్తాయని గవర్నర్ వివరించారు. ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆగస్టు నెల 26న 34 మంది కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేసుకోగా నలుగురు మృతి చెందారు. దీంతో మిగతా వారికి నగరంలోని వేరు వేరు ఆస్పత్రిల్లో చికిత్స అందిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.












Click it and Unblock the Notifications