అంబులెన్స్లను ఎవరు అపమన్నారు? పాతబస్తీ పరిస్థితి ఏంటీ?: కేసీఆర్ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వ వైఖరి, సరిహద్దుల్లో అంబులెన్స్లను అడ్డుకోవడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంగళవారం హైకోర్టు విచారించింది. ఈ విచారణకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరయ్యారు.

అంబులెన్స్లను నిలిపేయడం మానవత్వమా?
కరోనా విపత్తు వేళ రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్లను నిలిపేయడం మానవత్వమా? అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏ అధికారంతో రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్స్లు ఆపారని నిలదీసింది. సోమవారం నుంచి రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ, మహారాష్ట్ర నుంచి వచ్చే అంబులెన్స్లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్న నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు స్పందించింది.

రంజాన్ తర్వాత లాక్డౌన్ విధిస్తారా?
మరోవైపు రాష్ట్రంలో కరోనా కర్ఫ్యూ సరిగా అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. రంజాన్ తర్వాతే కరోనా కట్టడిపై తదుపరి చర్యలు(లాక్డౌన్ లాంటివి) చేపట్టాలని భావిస్తున్నారా? అని హైకోర్టు కేసీఆర్ సర్కారును ప్రశ్నించింది. ఈలోగా కరోనా ఎంత వ్యాప్తి చెందుతుందో మీకు తెలుసా? అని నిలదీసింది. మతపరమైన ప్రదేశాల్లో జనసమీకరణ ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేసింది.

పాతబస్తీలో కరోనా నిబంధనలు పాటించడంలేదు
మతపరమైన కార్యక్రమాలను ఎందుకు నియంత్రించడం లేదని సర్కారును నిలదీసింది హైకోర్టు. ప్రభుత్వం చెప్పే విషయాలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనలేదని వ్యాఖ్యానించింది. కరోనా పరీక్ష పెంచాలని ఆదేశిస్తే మరింత తగ్గిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నిబంధనల ఉల్లంఘనలపై మీడియా కళ్లకు కట్టినట్లు చూపిస్తోందని, పాతబస్తీలో ఈ ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తమకు మెయిల్స్, సందేశాల ద్వారా ఫిర్యాదులు అందున్నాయని హైకోర్టు తెలిపింది.

కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరిక
కోర్టు ఆదేశాలను బుట్టదాఖలు చేయడం బాధాకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. అధికారులు కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది. కరోనా నియంత్రణకు తదుపరి చర్యలు ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన రోజే.. లాక్డౌన్ అవసరం లేదంటూ సీఎస్ ఎలా చెప్తారంటూ ప్రశ్నించింది. ఆ తర్వాత అడ్వోకేట్ జనరల్(ఏజీ) వివరణ ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం జరిగే కేబినెట్ సమావేశంలో కరోనా కట్టడిపై నిర్ణయాలు తీసుకుంటారని కోర్టుకు తెలిపారు. దీంతో తమ ఆందోళనను కేబినెట్ దృష్టికి తీసుకెళ్లాలని కోర్టు ఈ సందర్భంగా సూచించింది. కేబినెట్ సమావేశం అయ్యే వరకు విచారణ వాయిదా వేయాలని ఏజీ హైకోర్టును కోరడంతో మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా వేసింది.

ఫోన్ వస్తేనే తెలంగాణలోకి అంబులెన్స్ ఎంట్రీ.. ప్రాణాలు పోతున్నా..
మరోవైపు, మంగళవారం కూడా సరిహద్దుల్లో అంబులెన్స్లను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ తెలంగాణ సరిహద్దులో అంబులెన్స్ కష్టాలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా గరికపాడు చెక్ పోస్టు వద్ద విజయవాడ నుంచి వస్తున్న అంబులెన్స్ను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ పోలీసులు అడ్డుకుంటున్నారని అంబులెన్స్ డ్రైవర్ తెలిపాడు. అంబులెన్స్లో కోవిడ్ పేషెంట్ ఉన్నాడని... అతన్ని హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసేందుకు వెళుతున్నామని చెప్పిన డ్రైవర్... తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు.. ఏ హాస్పిటల్కు అయితే పేషెంట్ను అడ్మిట్ చేసేందుకు వెళుతున్నామో.. ఆ హాస్పిటల్ ల్యాండ్ ఫోన్ నుంచి తమకు ఫోన్ చేయించాలంటూ తెలంగాణ పోలీసులు పేచీ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే కాల్ చేస్తుంటే అక్కడి హాస్పిటల్ వారు ఫోను ఎత్తడం లేదని... మరోవైపు అంబులెన్స్లో ఉన్న ఆక్సిజన్ గంట మాత్రమే ఉందని చెప్పారు. ఒకవేళ తిరిగి గ్రామానికి తీసుకెళ్లాలంటే రెండు గంటలు పడుతుందని ఆలోగ ఆక్సిజన్ అయిపోతే పేషంట్ పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు.












Click it and Unblock the Notifications