గుడ్న్యూస్: సమ్మెకాలానికి ఆర్టీసీ ఉద్యోగుల జీతం విడుదల.. 52 రోజులకు రూ.235 కోట్లు..
ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందజేసింది. డిమాండ్ల కోసం గతేడాది దసరా సమయంలో ఆందోళన చేసిన కార్మికులను ఆదుకుంది. చెప్పినట్టుగానే సమ్మె కాలానికి జీతం విడుదల చేసింది. సమ్మె తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సమ్మె కాలానికి కూడా జీతం విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆర్థికశాఖ నిధులు విడుదల చేసింది. సమ్మెకాలానికి సంబంధించి రూ.235 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఉద్యోగులకు 52 రోజుల జీతం అందబోతోంది. తమ వేతనం విడుదల చేయడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
26 డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ యూనియన్లు గతేడాది అక్టోబర్ 5వ తేదీన సమ్మె చేపట్టాయి. ఆర్టీసీని విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్తో ముందుకొచ్చాయి. డిపోల ఎదుట నిరసన ర్యాలీ చేపట్టారు. సకల జనుల సమ్మెను మించి నిరసన చేపట్టారు. కానీ ఆర్టీసీ కార్మికుల గొంతెమ్మ కోరికలని, సమ్మెపై సీఎం కేసీఆర్ కఠినంగానే వ్యవహరించారు. హైకోర్టుకు వెళ్లిన ప్రయోజనం లేకపోవడంతో.. చివరకు కార్మికులే దిగివచ్చారు. విధుల్లో చేరతామని చెప్పడంతో.. మంత్రివర్గ సమావేశం నిర్వహించి.. కార్మికులను సీఎం కేసీఆర్ విధుల్లోకి తీసుకున్నారు.