tsrtc strike:ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే, తాటాకు చప్పుళ్లకు బెదరం: అశ్వథామ
టీఎస్ఆర్టీసీ సమ్మె కార్మికుల కోణంలోనే చూడాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. సమ్మెను రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజా రవాణా వ్యవస్థను బతికించేందుకు సమ్మెబాట పట్టామని మరోసారి స్పష్టంచేశారు. ఏపీలో చేసినట్టు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మద్దతు కోరారు. తర్వాత అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
మీదే బాధ్యత..
తమిళనాడులో కూడా కార్మికుల ఆందోళన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తీర్చాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కానీ బెదిరిస్తూ, భయాందోళనకు గురిచేయడం సరికాదన్నారు. ఆర్టీసీ డ్రైవర్తో కేసు పెట్టించినంత మాత్రానా భయపడనని అశ్వత్థామరెడ్డి స్పష్టంచేశారు. ఆర్టీసీ కార్మికులు, సంస్థ కోసం పాటుపడతానని తేల్చిచెప్పారు.
మరిన్ని అద్దె బస్సులా..?
ఆర్టీసీ సమ్మెకు హుజూర్ నగర్ ఫలితాలకు ఏంటీ సంబంధం అని అశ్వత్థామరెడ్డి ప్రశ్నించారు. న్యాయమైన హక్కుల కోసం సమ్మెబాట పట్టినట్టు వివరించారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం అహంకారంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే ఆర్టీసీలో 2 వేల ప్రైవేట్ బస్సులు ఉండగా మరిన్ని తీసుకొస్తామని చెప్పడం సరికాదన్నారు. దీంతో ఆయన ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు.
అదరం బెదరం..
సీఎం స్థాయిలో ఉండి కేసీఆర్ బెదిరించడం సరికాదని అశ్వత్థామ అన్నారు. ఆయన తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. సీఎం మాటలు విని ఆర్టీసీ కార్మికులు ఒత్తిడికి లోనవుతున్నారని చెప్పారు. నల్గొండలో మరో కార్మికుడు గుండెపోటుకు గురై చనిపోయాడని తెలిపారు. ప్రభుత్వ వైఖరితోనే ఆర్టీసీ దీపాలు ఆరిపోతున్నాయని.. దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని అశ్వత్థామ డిమాండ్ చేశారు.
ఇచ్చిన హామీని విస్మరించారా..?
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని అశ్వత్థామరెడ్డి గుర్తుచేశారు. ఎన్నికలకు ముందు హామీనిచ్చి తర్వాత మరచిపోతారా అని ప్రశ్నించారు. ఇది సరికాదని సూచించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు తమ సమ్మె కొనసాగుతుందని తేల్చిచెప్పారు. ఇందులో అనుమానానికి ఇసుమంతైనా తావులేదని స్పష్టంచేశారు.