TSRTC STRIKE: సంయమనంగా ఉండండి, ప్రభుత్వంతో మాట్లాడతా.. ఆర్టీసీ నేతలతో గవర్నర్
ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మె 17వ రోజుకు చేరినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. చర్చలు జరుపాలని హైకోర్టు సూచించినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతలు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ను కలిశారు. తమ సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. తమ విజ్ఞప్తి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సానుకూలంగా స్పందించారని కార్మికులు మీడియాకు తెలిపారు.
చేయి చేయి కలిపి
సమ్మెకు మద్దతు ఇస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు కార్మిక సంఘం నేతుల ధన్యవాదాలు తెలిపారు. సింగరేణి, విద్యుత్ సంఘాలు కూడా తమకు సపోర్ట్ చేస్తారని పేర్కొన్నారు. ఆర్టీసీని రక్షించేందుకు పాటుపడుతున్నామని.. ధైర్యంగా ఉండి, సమస్యలు పరిష్కరించేందుకు పోరాడుతామని స్పష్టంచేశారు. తమకు సబ్బండ వర్గాల మద్దతు ఉందని.. మరో సకల జనుల సమ్మెలా ఉద్యమిస్తామని వారు పేర్కొన్నారు.
ప్రజా మద్దతు కూడా
కార్మిక సంఘాలతో చర్చించి త్వరలో మరో రోజు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జేబీఎస్లో వంటవార్పు చేపడుతామని పేర్కొన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా పోరాడుతామని తేల్చిచెప్పారు. తమకు ప్రజల మద్దతు ఉందని స్పష్టంచేశారు.
తొందరపడొద్దు
తమ డిమాండ్లను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని అశ్వత్ధామరెడ్డి తెలిపారు. సమ్మెపై గవర్నర్ వద్ద పూర్తి సమాచారం ఉందని చెప్పారు. ఉద్యోగులు సంయమనంగా ఉండాలని, ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పారని తెలిపారు. కార్మికుల సమ్మెపై ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పినట్టు అశ్వత్థామ పేర్కొన్నారు. జీతాల కోసం డబ్బులు లేవనడం సరికాదన్నారు.
డబ్బులేమయ్యాయి..
గత 17 రోజుల నుంచి సమ్మె చేస్తున్నామని.. అంతకుముందు నెల వచ్చిన నగదు ఏమైందని ప్రశ్నించారు. తమ జీతాలు మాత్రం రూ.105 కోట్లేనని తేల్చిచెప్పారు. ఆ డబ్బులు.. 17 రోజులుగా ఆర్టీసీ నడుస్తోన్న ఆదాయం ఏదీ అని ప్రశ్నించారు. ఆర్టీసీ ఆస్తులను కాపాడుకునేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తామని చెప్పారు. ఆర్టీసీ ఆస్తులపై కన్నేసి.. ప్రైవేట్ పరం చేయాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఆర్టీసీ ఆస్తులను కాపాడేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. కార్మిక ప్రయోజనాలు ముఖ్యమని.. దీంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకుంటామని అశ్వత్థామరెడ్డి స్పష్టంచేశారు.