మిలియన్ మార్చ్ని మించేలా.. సీఏఏకి వ్యతిరేకంగా హైదరాబాద్లో భారీ తిరంగా ర్యాలీ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని వ్యతిరేకిస్తూ యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ హైదరాబాద్లో భారీ తిరంగ ర్యాలీ చేపట్టింది. మీర్అలం దర్గా నుంచి బాబా కాంటా వరకు చేపట్టిన ఈ ర్యాలీకి ముస్లింలు భారీగా తరలివచ్చారు. మజ్లిస్ అధినేత,హైదరాబాద్ ఎంపీ ఓవైసీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతీ ఒక్కరు తిరంగా జెండా పట్టుకుని ర్యాలీకి తరలివచ్చారు. శుక్రవారం కావడంతో మసీదులో ప్రార్థనలు పూర్తయిన అనంతరం ముస్లింలంతా ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీ బాబా కాంటా వరకు చేరుకున్న తర్వాత.. అక్కడి నుంచి తిరిగి మీర్అలంకు వస్తారు. పాతబస్తీ నలుమూల నుంచి ముస్లింలు మీర్అలం బాట పట్టడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. పోలీసులు అనుమతితోనే సాగుతున్న ఈ ర్యాలీలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అదనపు ఫోర్స్ను కూడా రంగంలోకి దించారు.

భారీ తిరంగా ర్యాలీ
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింలంతా తిరంగా ర్యాలీలో పాల్గొంటున్నారు. ర్యాలీ బాబా కాంటా వరకు చేరుకున్నాక.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగిస్తారు. ర్యాలీ అనంతరం ప్రతీ ముస్లిం తమ ఇంటిపై తిరంగా జెండాను పెట్టాలని ఇప్పటికే ఓవైసీ పిలుపునిచ్చారు.

మిలియన్ మార్చ్ను మించేలా
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇటీవల ట్యాంక్బండ్పై జరిగిన మిలియన్ మార్చ్ని మించేలా నేటి తిరంగ ర్యాలీ చేపట్టనున్నారు. పాతబస్తీ, మెహిదీపట్నం, మల్లేపల్లి, మలక్పేట్, ముషీరాబాద్, నాంపల్లితో పాటు వివిధ బస్తీల నుంచి ముస్లింలు మీరాలం ఈద్గా వరకు చేరుకుంటారు. అక్కడి నుంచి హసన్నగర్, ఆరాంఘర్, మైలార్దేవ్పల్లి, శాస్త్రిపురం, కింగ్స్కాలనీ, బాబా కాంటా వరకు ర్యాలీ నిర్వహిస్తారు.

ట్రాఫిక్ మళ్లింపు
తిరంగ ర్యాలీ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. శంషాబాద్, కాటేదాన్ మార్గాల నుంచి వచ్చే వాహనాలను బహదూర్పురా, జూపార్క్ మార్గాల్లోకి అనుమతించరు. ఆరాంఘర్ ఎక్స్ రోడ్ నుంచి మెహిదీపట్నం మీదుగా ఆ వాహనాలను మళ్లించనున్నారు. అలాగే బహదూర్పురా,కిషన్బాగ్ మార్గాలను కూడా వాహనాలు రాకుండా బ్లాక్ చేశారు. అటువైపు నుంచి వచ్చే వాహనాలను మెట్రో పిల్లర్ నంబర్.202 వద్ద డైవర్షన్ తీసుకొని మెహిదీపట్నం మీదుగా మళ్లించనున్నారు.

ట్రాఫిక్ ఆంక్షలు
ఆరాంఘర్ జంక్షన్, కాటేదాన్ నుంచి వచ్చే వాహనాలను చంద్రాయణగుట్ట మీదుగా వెట్లేపల్లి గేటు, శాస్త్రిపురం వైపు మళ్లించనున్నారు. అలాగే మెహిదీపట్నం నుంచి వచ్చే వాహనాలు పిల్లర్.143 వద్ద ఆరాంఘర్ మీదుగా మళ్లించనున్నారు. మెహిదీపట్నం నుంచి కిషన్బాగ్,బహదూర్పురా వైపు వాహనాలను అనుమతించరు. ఇక ఫలక్నుమా,మైలార్దేవ్ పల్లి మీదుగా శాస్త్రిపురం వెళ్లే వాహనదారులు మెహరాజా హోటల్ వద్ద నుంచి దారి మళ్లించనున్నారు. దానమ్మ గుడిసె,హసన్నగర్ నుంచి కింగ్స్ కాలనీ శాస్త్రిపురం వైపు వాహనాలను అనుమతించరు.ఆ వాహనాలు బాబా కాంటా వద్ద టర్నింగ్ తీసుకుని ఆరాంఘర్ జంక్షన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications