జీహెచ్ఎంసీ పరిధిలో విజిలెన్స్ దాడులు: ఆర్సీ రెడ్డి, శ్రీ చైతన్య సంస్థలపై దాడులు ఎందుకంటే..?
హైదరాబాద్: మార్చి 31 వరకు పలు షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలు, ఇతరత్రా జనసమ్మర్దత కలిగి ఉన్న ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేయాలంటూ తెలంగాణ సర్కార్ జారీ చేసిన ఆదేశాలను పలు సంస్థలు పాటించలేదు. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్, విజిలెన్స్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు పలు సంస్థలపై దాడులు నిర్వహించారు.
మార్చి 31 వరకు షాపింగ్ మాల్స్ విద్యాసంస్థలు, సినిమా హాళ్లు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ యథావిధిగా కార్యకలాపాలు సాగించిన సంస్థలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో పబ్బులు, జిమ్, స్పోర్ట్స్ అకాడమీలు, మరియు పలు కోచింగ్ సంస్థలపై దాడులు నిర్వహించారు.
ఇక దాడులు నిర్వహించి పలు సంస్థలను సీల్ చేశారు అధికారులు .ఇందులో ప్రముఖ ఎయిర్ హాస్టెస్ ఇన్స్టిట్యూట్ ఫ్రాంక్ ఫిన్ , జెనాస్ ఇంటర్నేషనల్ స్కూల్, శ్రీచైతన్య అకాడెమీ కాలేజీ, ఆర్సీ రెడ్డి ఐఏఎస్ అకాడెమీ, శ్రీచైతన్య ఐఏఎస్ అకాడెమీ, ఎలైట్ స్పోర్ట్స్ హబ్, చిల్లీస్ బార్ అండ్ రెస్టారెంట్, స్మాష్ బార్ అండ్ రెస్టారెంట్, మాక్ ఏవియేషన్ అకాడెమీ మరియు జునైద్ ట్యుటోరియల్ లాంటి సంస్థలున్నాయి.
కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని జనసమ్మర్దత ప్రాంతాలను మూసివేయాలని సీఎం కేసీఆర్ మార్చి 14న చెప్పారు. మార్చి 21వరకు పార్క్లు, థియేటర్లు, మ్యూజియంలు, జిమ్, బార్లు, పబ్లు మూసివేయాలంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక వీటిని సమీక్షించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలోని ఎన్ఫోర్స్మెంట్ మరియు విజిలెన్స్ సంస్థలు 18 బృందాలుగా ఏర్పడి దాడులు చేస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించి సంస్థల్లో యాథావిధిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలపై దాడులు చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద కేసులు నమోదు చేసి సంస్థలను సీజ్ చేస్తున్నారు.
Recommended Video
ఇక షాపింగ్ మాల్స్, హైపర్ మార్కెట్లు, చిన్న వాణిజ్య సముదాయాలు థర్మల్ స్క్రీనింగ్ ద్వారా కస్టమర్లను స్క్రీన్ చేయాలని అదే సమయంలో శానిటైజర్లు కూడా ఇవ్వాలని అధికారులు సూచించారు. అంతేకాదు ఆయా సంస్థల్లో పనిచేసే సిబ్బందికి మొత్తం గ్లవ్స్, మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని ఆదేశించడం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణలో ఐదు కరోనావైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మార్చి 13న తొలి పేషెంట్ డిశ్చార్జ్ అవ్వడం జరిగింది.