తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు: ఈ జిల్లాలకు అలర్ట్
హైదరాబాద్: బుధవారం కాస్త ఎడతెరిపినిచ్చినప్పటికీ సాయంత్రం నుంచి హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది.

కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. ఈ ప్రభావంతో హైదరాబాద్(Hyderabad)లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. కొద్దికొద్దిగా ప్రారంభమైన వర్షం కొద్ది సేపట్లోనే భారీవర్షంగా మారింది. రాయదుర్గం, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, బహదూర్పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, లక్డీకపూల్, సుచిత్ర, సనత్నగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, అల్వాల్, ప్యారడైజ్, బేగంపేట్, ఆర్టీసీ క్రాస్రోడ్, ట్యాంక్బండ్, తార్నాక, నాగోలు, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వాన కురవకపోవడంతో.. రహదారులపైకి వచ్చిన వాహనదారులు, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న ఉద్యోగులు వర్షంలో చిక్కుకుపోయారు. ఒక్కసారిగా కుండపోతగా కురియడంతో.. క్షణాల్లోనే రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
రాయదుర్గం, కూకట్పల్లి, పంజాగుట్ట, మలక్పేట తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కూకట్ పల్లి ప్రాంతంలోని హైదర్ నగర్ రోడ్లో హోలిస్టిక్ ఆసుపత్రి, ప్రభుత్వ పాఠశాల ముందు భారీగా వరద నీరు చేరి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. గంటన్నర పాటు రోడ్డుపై వరదనీరు నిలిచిపోవడంతో నిజాంపేట్-బాచుపల్లి రహదారిలో వాహనదారులు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. కాగా, గురువారం, శుక్రవారం మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.
మరోవైపు, హైదరాబాద్ నగరంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జంట జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఆరు గేట్లను.. రెండు అడుగుల మేర ఎత్తి సుమారు 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నగరంలో మూసీనది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జియాగూడ వద్ద మరింత వేగంగా ప్రవహిస్తోంది.
జియాగూడ-పురానాపుల్ను కలిపే 100 ఫీట్ల రహదారిపై రెండడుగుల మేర నీరు చేరడంతో పోలీసులు వాహన రాకపోకలను నిలిపివేశారు. బ్యారికేడ్లు అడ్డుపెట్టి అటువైపు ఎవ్వరినీ రాకుండా పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారు. వరద ప్రవాహం మరింత పెరిగితే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారిని.. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూసీ వరద ఉద్ధృతి పెరగడంతో.. మూసారాంబాగ్ వంతెనపై రాకపోకలను నిలిపేశారు.
ప్రవాహ తీవ్రతను బట్టి రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు.












Click it and Unblock the Notifications