ఈ డాక్టర్లకు ఏమైంది ... నిర్లక్షం ఖరీదు నిండు ప్రాణాలు కాదా
వైద్యో నారాయణో హరి అంటారు. అంటే వైద్యుడు ఆ భగవంతుడైన శ్రీమన్నారాయణుడి తో సమానం. అటువంటి డాక్టర్లకు ఏమైంది ? నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న డాక్టర్లు ఆపరేషన్లు చేసి కడుపులో కత్తెర లు, బట్టలు మర్చిపోతుంటే వీరి నిర్లక్ష్యం రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఆపరేషన్ చేసే సమయంలో తాము ఏమి చేస్తున్నామో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో డాక్టర్లు ఉన్నారంటే వైద్యవృత్తి ఎటువైపు వెళుతుందో అన్న ఆందోళన కలుగుతోంది.ఇప్పటికే ఆస్పత్రికి వెళితే నిలువు దోపిడీ చేస్తారు అని డాక్టర్లపై అపవాదులు వస్తున్న నేపథ్యంలో, దానికితోడు నిర్లక్ష్యం కూడా కలిస్తే వైద్య వృత్తికే కళంకం కాదా... ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం కాదా...

మొన్న కడుపులో కత్తెర మరచిన నిమ్స్ వైద్యుల నిర్వాకం
మొన్నటికి మొన్న నిమ్స్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. నిమ్స్ వైద్యులు ఒక రోగి ప్రాణాలతో చెలగాటమాడారు. మహేశ్వరి అనే మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో కత్తెర మర్చిపోయి కుట్లు వేశారు. ఆపరేషన్ తర్వాత కూడా తరచూ కడుపునొప్పి వస్తుండటంతో వైద్యులను సంప్రదించడం తో డాక్టర్లు ఎక్సరే తీశారు. రిపోర్టు చూసి రోగితోపాటు డాక్టర్లు షాక్ అయ్యారు. కడుపులో కత్తెర వదిలేసి కుట్లు వేశారని గుర్తించిన డాక్టర్లు మహేశ్వరి కి విషయం చెప్పడంతో నిమ్స్ ఆసుపత్రి ముందు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం పై మహేశ్వరి తాలూకు బంధువులు ఆందోళన చేశారు. ఇక ఎపిసోడ్ లో మళ్లీ మహేశ్వరి కి ఆపరేషన్ చేసి కడుపులో నుండి కత్తెరను తీసేశారు.

నేడు గర్భిణి గర్భంలో గుడ్డ పెట్టి కుట్లేసిన వైనం
ఇక తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చిన ఓ గర్భిణికి సైతం డెలివరీ చేసిన వైద్యులు ఇదే తరహా పని చేశారు. ఈసారి కత్తెర పెట్టలేదు కానీ గర్భిణీ మహిళ కడుపులో బట్ట పెట్టి అలాగే మరిచిపోయి కుట్లు వేశారు. గవర్నమెంట్ ఆసుపత్రిలోనే డెలివరీ అయిన ఆ మహిళకు ఏలేశ్వరం ఆసుపత్రి స్టాప్ నర్సు శాంతకుమారి కుట్లు వేసింది. ఇంటికి వెళ్లిన ఆమె తీవ్ర కడుపునొప్పితో బాధ పడింది. తిరిగి ఆసుపత్రికి రాగా కడుపులో బట్టను వదిలేసి కుట్లు వేశారన్న వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో హుటాహుటిన తిరిగి ఆపరేషన్ నిర్వహించి కడుపులో ఉన్న బట్టను తొలగించారు వైద్యులు.అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించి కడుపులో బట్ట పెట్టి కుట్లేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ తరుపు బంధువులు కోరుతున్నారు.

వైద్యుల నిర్లక్ష్యం ఖరీదు ... నిండు ప్రాణాలు
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఆపరేషన్ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన వైద్యులు అజాగ్రత్త వహించడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడతారని నమ్మి వైద్యుల వద్దకు వెళితే, పోయేది మన ప్రాణం కాదుగా అన్నట్టు వ్యవహరిస్తున్న డాక్టర్ల తీరు ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కచ్చితంగా వీరి పైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే డాక్టర్ల నిర్లక్ష్యానికి విలువైన నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే ధన్వంతరి వారసులు ఇప్పటికైనా అలసత్వాన్ని వీడాలి. నిర్లక్ష్యం ఖరీదు తిరిగి తీసుకురాలేని నిండు ప్రాణాలు అని డాక్టర్లు గుర్తించాలి.












Click it and Unblock the Notifications