ఎన్నారై జయరాం హత్య: తొలి రోజు కస్టడీలో రాకేష్ రెడ్డి ఏం చెప్పాడంటే?
హైదరాబాద్: ఎన్నారై జయరాం హత్య కేసులో పోలీసులు బుధవారం ఉదయం రాకేష్ రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకొని విచారించారు. మూడు రోజుల పాటు ఆయనను పోలీసుల కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు మొదటి రోజైన బుధవారం నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా రాకేష్ పలు విషయాలు వెల్లడించాడని తెలుస్తోంది. అది ప్రీ ప్లాన్ మర్డర్ కాదని, జయరాంను చంపాలనే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. అప్పటికే అనారోగ్యంతో ఉన్న జయరాం తాను కొట్టిన దెబ్బలకు చనిపోయాడని అన్నారు. తనకు ఇవ్వాల్సిన డబ్బుల కోసమే అమ్మాయి పేరుతో ట్రాప్ చేసి ఇంటికి పిలిపించానని చెప్పారు.
గత నెల 31వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి జయరాం మృతదేహాన్ని కారులో పెట్టుకొని హైదరాబాదులో తిరిగినట్లు రాకేష్ రెడ్డి చెప్పాడని తెలుస్తోంది. హత్య జరిగిన తర్వాత ఏసీపీ మల్లారెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు చెప్పాడు. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని తాను భావించానని చెప్పాడు. శవంతో సహా కారులో నల్లకుంట పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లినట్లు చెప్పాడు.
దాదాపు నలభై నిమిషాల పాటు నల్లకుంట పోలీస్ స్టేషన్ ఎదుట శవంతో సహా కారును ఉంచినట్లుగా రాకేష్ రెడ్డి చెప్పాడని తెలుస్తోంది. అయితే శవాన్ని అక్కడి నుంచి తీసుకు వెళ్లాలని తనకు సీఐ చెప్పాడని వివరించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత అప్పుడు ఇబ్రహీంపట్నం ఏసీపీగా మల్లారెడ్డితో మాట్లాడినట్లు చెప్పాడు. కాగా, ఏపీ పోలీసులకు చెప్పిన విషయాలనే రాకేష్ రెడ్డి తెలంగాణ పోలీసులకు చెప్పాడని తెలుస్తోంది.