tsrtc strike:ఏపీలో ఎలా సాధ్యం.. తెలంగాణలో ఎందుకు కాదు.. ఆర్టీసీ విలీనంపై సురవరం
ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానం సరికాదని సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. కార్మికుల హక్కులను అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రోడ్డు రవాణా సంస్థ అనేది వ్యాపార వ్యవస్థ కాదని.. ప్రజా రవాణా అనే విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ నేత కూనమనేని సాంబశివరావు దీక్ష చేపట్టారు. సురవరం వచ్చి కూనమనేని చేత దీక్షను ప్రారంభింపజేశారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఐ నేత కూనమనేని సాంబశివరావు దీక్ష చేపట్టారు. సీపీఐ కార్యాలయంలో ఆయన చేత దీక్షను సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. దీక్షను ఇందిరా పార్క్ వద్ద చేపట్టాలని కూనమనేని సాంబశివరావు అనుకొన్నారు. కానీ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో తమ పార్టీ కార్యాలయంలోనే దీక్ష చేపట్టారు.
ఆర్టీసీకి నష్టాలు వచ్చినా.. లాభాలు వచ్చిన నడిపించాలని సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. రోడ్డు రవాణా సంస్థపై లాభాలు ఎలా ఆశిస్తారని కేసీఆర్ను ప్రశ్నించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులపై అణచివేత ధోరణి సరికాదని.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపడం కూడా ఓ హక్కేనని గుర్తుంచుకోవాలన్నారు. పొరుగు రాష్ట్రం ఏపీలో ఆర్టీసీ విలీనం సాధ్యమైందని గుర్తుచేశారు. ఏపీలో సాధ్యమైనప్పుడు తెలంగాణలో సమస్య ఏంటీ అని సురవరం ప్రశ్నించారు. ధనిక రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే పరిస్థితి లేదా అని నిలదీశారు.
హుజూర్నగర్ ఉప ఎన్నికలో విజయం దేనికి ప్రామాణికం కాదని సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహాజమనే విషయం కేసీఆర్కు తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో టీఆర్ఎస్ గెలిచినంతా మాత్రానా.. మీరు చేసిన తప్పులు ఒప్పులవుతాయా అని అడిగారు. మీరు చేసిన, చేస్తోన్న అంశాలను ప్రజలు నిశీతంగా గమనిస్తున్నారని సురవరం అన్నారు.