కుమ్రం భీమ్ ఆశయ సాధన కోసం పనిచేస్తాం: సీఎం కేసీఆర్
అడవి బిడ్డల హక్కుల పోరాట యోధుడు, కుమ్రం భీమ్ ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వుందని సీఎం కేసీఆర్ అన్నారు. ' మా గూడెం, మా తండా, మా రాజ్యం' అనే ఆదివాసీల తర తరలా ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం నిజం చేసిందన్నారు. ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రం భీమ్ జయంతి సందర్భంగా కొమ్రం భీమ్సేవలను స్మరించుకున్నారు. తర్వాత ఘన నివాళి తెలిపారు.
ఆదివాసీల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తోందని కేసీఆర్ తెలిపారు. కొమ్రం భీమ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని వివరించారు. అమరుడు కొమ్రం భీమ్ పోరాట ప్రదేశం జోడేఘాట్ను అన్ని హంగులతో అభివృద్ధి పరిచామన్నారు. కొమ్రం భీమ్ స్మారక చిహ్నం, స్మృతివనం, గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసి, భీమ్ పోరాట పటిమను భవిష్యత్ తరాలకు తెలియపరిచే విధంగా మౌలిక వసతులను జోడేఘాట్లో ఏర్పాటు చేశామన్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున ఆదివాసీల ఆత్మగౌరవాన్ని నిలిపేలా ఆదివాసీ భవన్ నిర్మాణం చేపట్టినామని తెలిపారు. అది ప్రారంభోత్సవానికి సిద్ధమైందన్నారు. 'జల్ జంగల్ జమీన్' అనే కొమ్రం భీమ్ నినాదంలోని స్పూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధాన ఉద్యమంలోనూ, స్వరాష్ట్ర అభివృద్ధి పధంలోనూ ఇమిడి ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. అడవులు, ప్రకృతి పట్ల ఆదివాసీ బిడ్డలకు ఉండే ప్రేమ గొప్పదని, వారి స్పూర్తిని ప్రతి ఒక్కరూ కలిగి వుండాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం అనే సంగతి తెలిసిందే. అలానే మహానీయులను స్మరించుకొని ప్రభుత్వం ముందుడుగు వేస్తోంది. కుమ్రం భీమ్ కూడా తమకు ఆదర్శప్రాయుడని సీఎం కేసీఆర్ వివరించారు.