హైదరాబాద్లో యశోదా ఆసుపత్రి డాక్టర్ అనుమానాస్పద మృతి..
హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రిలో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్న సుభాష్(32) అనే వైద్యుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. షేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రి నగర్లో ఉన్న పద్మావతి అపార్ట్మెంటులోని తన నివాసంలో అతను విగతజీవిగా కనిపించాడు. గురువారం జ్వరం కారణంగా అతను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం అతని మృతిపై పోలీసులకు సమాచారం అందింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సుభాష్ జ్వరంతో బాధపడుతూ చనిపోయాడన్న అనుమానాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
పోలీసులు మృతుడిని మంచిర్యాల జిల్లా తంగూర్ గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. యశోదా ఆసుపత్రిలో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్న అతను.. 2017లో నేరెడ్మెట్కి చెందిన డా.లాస్యను ఆర్యసమాజ్లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు రెండేళ్లుగా గాయత్రి నగర్లోని పద్మావతి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. పెళ్లి తర్వాత కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగినప్పటికీ.. కొన్ని నెలల క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తినట్టు తెలుస్తోంది. అప్పటినుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఇదే క్రమంలో అతను అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.