రోహిత్ శర్మపై వేటు వేస్తారా?: పాకిస్తాన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కోహ్లీ రియాక్షన్ ఇదీ..!
అబుధాబి: యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన భారత్-పాకిస్తాన్ మధ్య టీ20 మ్యాచ్ ముగిసింది. చేదు ఫలితాన్ని ఇచ్చింది. టీమిండియా అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోవడానికి ఇష్టపడని రిజల్ట్ ఇది. చిరకాల ప్రత్యర్థి, దాయాది జట్టు.. ఏకపక్షంగా భారత్పై విజయం సాధించింది. తన చిరకాల కోరికను ఘనంగా నెరవేర్చుకుంది. ప్రపంచకప్ టోర్నమెంట్లల్లో భారత జట్టుపై విజయఢంకా మోగించింది. దశాబ్దాలుగా వెంటాడుతూ వస్తోన్న పరాజయానికి అడ్డుకట్ట వేసింది.
వికెట్ నష్టపోకుండా..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కొనసాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత్.. దాయాది పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా- 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ టీమ్.. అలవోకగా ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో ఒక్క వికెట్ కూడా నష్టపోలేదు. ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది.
బౌలర్ల విఫలం..
ఓపెనర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్.. అర్ధ సెంచరీలు చేశారు. బాబర్ ఆజమ్-52 బంతుల్లో రెండు సిక్సర్లు ఆరు ఫోర్లతో 68 పరుగులు, రిజ్వాన్-55 బంతుల్లో మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 79 పరుగులు చేశారు. నాటౌట్గా నిలిచారు. టీమిండియాలో ఏ ఒక్క బౌలర్ కూడా ప్రభావాన్ని చూపలేకపోయారు. వికెట్లను తీయడంలో దారుణంగా విఫలం అయ్యారు. మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్ భారీగా పరుగులను సమర్పించుకున్నారు.
బ్యాటింగ్ లైనప్ చెల్లాచెదురు..
టీమిండియాలో విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ మినహా మరెవ్వరూ రాణించలేకపోయారు. తమ సత్తాకు తగినట్టుగా ఆడలేకపోయారు. విరాట్ కోహ్లీ 49 బంతుల్లో ఒక సిక్సర్, అయిదు ఫోర్లతో 57 పరుగులు చేశాడు. రిషభ్ పంత్ 36 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. మరెవ్వరూ ఆ స్థాయిలో ఆడలేకపోయారు. ప్రత్యేకించి- ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ. వారిద్దరూ ఘోరంగా విఫలం కావడంతో బ్యాటింగ్ లైనప్ చెల్లాచెదురైంది. ఒత్తిడిని తట్టుకోలేక.. కుప్పకూలింది.
రోహిత్ డకౌట్పై..
మిగిలిన వారి మాటెలా ఉన్నప్పటికీ.. రోహిత్ శర్మ డకౌట్ కావడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. బౌలర్ల నుంచి టన్నుల కొద్దీ పరుగులను పిండి పడేసే రోహిత్ శర్మ- ఈ మ్యాచ్లో సున్నాకే వెనుదిరగడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గెలిచి తీరాల్సిన మ్యాచ్లో పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరడంపై అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను ఆధారంగా చేసుకుని, అతనిపై నిప్పులు చెరుగుతున్నారు.
రోహిత్పై వేటుపై
పాకిస్తాన్కు చెందిన ఓ జర్నలిస్ట్ కూడా ఇదేరకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.. కేప్టెన్ విరాట్ కోహ్లీ ఎదురుగానే. మ్యాచ్ ముగిసిన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ జర్నలిస్ట్- సూటిగా విరాట్ కోహ్లీకి తన ప్రశ్నను సంధించాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో విఫలమైన రోహిత్ శర్మను తదుపరి మ్యాచ్లో తొలగిస్తారా? అంటూ ప్రశ్నించాడు. దీనికి కోహ్లీ.. అంతే ఘాటుగా స్పందించాడు. రోహిత్ శర్మను వేటు వేస్తారనే ప్రశ్న అసంబద్ధమని అన్నాడు.
వివాదాలను రేకెత్తించాలంటే..
వామప్ మ్యాచ్లల్లో అతను ఏ విధంగా ఆడాడో చూల్లేదా అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. వివాదాలను సృష్టించాలని అనుకుంటే.. తనకు ముందే చెప్పాలని, దానికి అనుగుణంగా తాను సమాధానాలను ప్రిపేర్ చేసుకుని వచ్చేవాడిని కదా? అంటూ నవ్వుతూ చురకలు అంటించాడు. రోహిత్ శర్మకు బదులుగా ఇషాన్ కిషన్ను ఆడించాల్సి ఉందని పాకిస్తాన్ జర్నలిస్టులు చేసిన సూచనలకూ కోహ్లీ అదే రకంగా స్పందించాడు. సాహసంతో కూడిన ప్రశ్నను వేశారంటూ ఎద్దేవా చేశారు. ఓ అత్యుత్తమైన జట్టుతో తాను పాకిస్తాన్ను ఎదుర్కొన్నానని అన్నాడు.