రోహిత్ సేనకు ఆ టైటిల్ అందని ద్రాక్షే- ఆసీస్ చేతిలో ఘోర పరాజయం
లండన్: లండన్లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఆస్ట్రేలియా చేతిలో మట్టికరిచింది. చివరి రోజు- ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయారు.. చేతులెత్తేశారు. భారీ భాగస్వామ్యాలను నెలకొల్పడంలో దారుణంగా విఫలం అయ్యారు.
ఆస్ట్రేలియా నిర్దేశించిన 444 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా నాలుగో రోజే తడబడిన విషయం తెలిసిందే. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, వన్ డౌన్ బ్యాటర్ చేతేశ్వర్ పుజారా వికెట్లను కోల్పోయింది. మూడు వికెట్ల నష్టానికి 163 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో చివరి రోజు బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు అన్నీ అపశకునాలే ఎదురయ్యాయి. ప్రారంభంలోనే విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు.

44 పరుగుల తన వ్యక్తగత ఓవర్నైట్ స్కోర్కు ఇంకో అయిదు రన్స్ మాత్రమే జత చేసిన కోహ్లీ.. బోలాండ్ బౌలింగ్లో అవుట్ అయ్యడు. వికెట్లకు దూరంగా వెళ్తోన్న బంతిని డ్రైవ్ చేయబోయిన కోహ్లీ.. టైమింగ్ మిస్ అయ్యాడు. ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్స్ వైపు దూసుకెళ్లింది. సెకెండ్ స్లిప్లో ఉన్న స్టీవెన్ స్మిత్.. కుడివైపున డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు. అప్పటికి జట్టు స్కోర్ 179.
అక్కడ ఆరంభమైన వికెట్ల పతనానికి ఎక్కడా బ్రేకులు పడలేదు. 50 పరుగుల్లోపు మిగిలిన ఆరు వికెట్లను కోల్పోయింది టీమిండియా. కోహ్లీ స్థానంలో క్రీజ్లోకి దిగిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన ఖాతాను కూడా తెరవలేదు. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆఫ్ స్టంప్స్కు కొద్ది దూరంలో పిచ్ అయిన బంతిని డిఫెన్స్ ఆడటంలో రవీంద్ర జడేజా విఫలం అయ్యాడు. ఎడ్జ్ తీసుకున్న బంతిని క్యారీ అందుకున్నాడు.
ఈ రెండు వికెట్లు పడటంతోనే భారత్ పరాజయం దాదాపుగా ఖాయమైనట్టే కనిపించింది. క్రీజ్లో అజింక్య రహానె ఉండటంతో కొంత వరకు ఊరటనిచ్చినప్పటికీ- అది ఎంతో సేపు నిలవలేదు. అంజిక్య రహానె- వికెట్ కీపర్ కేఎస్ భరత్ కొద్దిసేపు బౌలర్లను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. అయిదో వికెట్కు 32 పరుగులను జోడించారు.
ఈ జోడి కుదురుకుందనుకున్న దశలో మిఛెల్ స్టార్క్ విజృంభించాడు. ఈ జంటను విడదీశాడు. 46 పరుగులు చేసిన అంజిక్య.. స్టార్క్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 212 పరుగుల వద్ద అజింక్య, 213 పరుగుల వద్ద శార్దుల్ ఠాకూర్ అవుట్ కావడంతో మ్యాచ్ ఆసీస్ చేతుల్లోకి వెళ్లింది. కేఎస్ భరత్ కూడా అవుట్ కావడంతో ఇక టీమిండియా పతనం కావడానికి ఎంతో సేపు పట్టలేదు. 234 పరుగులు ఆలౌట్ అయింది.
స్పిన్నర్ నాథన్ లియాన్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. నాలుగో రోజే రోహిత్ శర్మను అవుట్ చేసిన అతను ఇవ్వాళ కేఎస్ భరత్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ వికెట్లను నేల కూల్చాడు. బోలాండ్ అతనికి తోడయ్యాడు. మూడు వికెట్లను తీసుకున్నాడు. స్టార్క్-2, పాట్ కమ్మిన్స్ ఒక వికెట్ పడగొట్టారు. డబ్ల్యూటీసీ ఫైనల్స్లో టీమిండియాకు ఇది వరుసగా రెండో ఓటమి. 2021 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications