రాష్ట్రపతిగా రిటైర్ అయ్యాక ప్రణబ్ ముఖర్జీ ఎక్కడుంటారో తెలుసా?
11,776చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ఇల్లు ఢిల్లీలోని 10, రాజాజీ మార్గ్ లో ఉంది.
హైదరాబాద్: వచ్చే జూలైతో తన పదవి కాలం ముగియనుండటంతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. ప్రస్తుతం కేంద్రమంత్రి మహేశ్ శర్మ ఉంటున్న ఢిల్లీలోని 10, రాజాజీ మార్గ్ లోకి ఆయన నివాసం మారనుంది.
ఈ మేరకు ఇప్పటికే కేంద్రమంత్రి మహేశ్ శర్మకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేయడంతో.. ఇటీవలే ఆయన ఇల్లు ఖాళీ చేశారు. పైగా ఈ ఇల్లు తనకన్నా ప్రణబ్ ముఖర్జీకి కేటాయించడమే సబబు అన్నారు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైతం చనిపోయేంత వరకు ఇదే ఇంట్లో నివాసమున్నారు. 11,776చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ఇల్లు ఢిల్లీలోని 10, రాజాజీ మార్గ్ లో ఉంది. ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో గ్రంథాలయం కూడా ఉంది. కాగా, రాష్ట్రపతిగా పదవి విరమణ చేసినవారికి దేశంలో ఎక్కడైనా ఉచిత నివాసం కల్పిస్తారు. నీళ్లు, కరెంట్ సహా పలు మౌలిక సదుపాయాలను ఉచితంగానే అందిస్తారు. 1962 పెన్షన్ నిబంధనను వర్తింపజేస్తారు.