బెంగళూరులో 100 % కన్నడిగులకే ఉద్యోగాలు: ఆంధ్రులు వెళ్లిపోండి ?
బెంగళూరు: భారతదేశంలో నెంబర్ వన్ ఐటీ హబ్ గా బెంగళూరు నగరం వర్దిల్లుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు లక్షల మంది ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమకు చెందిన లక్షలాధి మంది ఇక్కడ ఎదో ఒక ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఇప్పుడు వారి మీద ఒక్కసారిగా పిడుగుపడినట్లు అయ్యింది. కర్ణాటకలోని అన్ని ప్రయివేట్ కంపెనీలు, పరిశ్రమలలో ఇక ముందు 100 శాతం ఉద్యోగాలు కన్నడిగులకే ఇవ్వాలని చట్టం తీసుకురావడానికి సిద్దరామయ్య ప్రభుత్వం సిద్దం అయ్యింది.
అయితే ఐటీ, బీటీ రంగాలకు మాత్రం మినాహాయింపు ఇవ్వాలని సిద్దరామయ్య ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రయివేటు కంపెనీలు, పరశ్రమలలో 100 శాతం ఉద్యోగాలు కన్నడిగులకు ఇవ్వడానికి చట్టం సవరించాలని కర్ణాటక కార్మిక శాఖ ప్రభుత్వానికి మనవి చేసింది.
ఈ నేపథ్యంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రయివేటు కంపెనీలు, పరిశ్రమలు 100 శాతం ఉద్యోగాలు కన్నడిగులకు ఇవ్వాలని త్వరలో ఆదేశాలు జారీ చెయ్యడానికి సిద్దం అయ్యింది.
100 శాతం ఉద్యోగాలు కన్నడిగులకు ఇవ్వని పక్షంలో అలాంటి ప్రయివేటు కంపెనీలు, పరిశ్రమలకు ప్రస్తుతం ఇస్తున్న అన్ని రాయితీలకు బ్రేక్ వెయ్యాలని సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమలు, ప్రయివేట్ కంపెనీలకు భూమితో పాటు విద్యుత్, నీరు తదితర సౌకర్యాలలో కేటాయిస్తున్న రాయితీలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవాలని సిద్దం అయ్యారని సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా రాయలసీమకు చెందిన ప్రజలు బెంగళూరు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఏదో ఒక పని చేసుకుంటూ కడుపునింపుకుంటున్నారు. చదువురాని వాళ్లు కూడా బెంగళూరు వెళ్లి కూలిపని అయినా చేసుకుని జీవనం సాగిద్దాం అని ఇక్కడికి వచ్చారు.
అయితే దక్షిణ భారతదేశంలో అధికారంలో ఉన్నఒకేఒక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి సిద్దం అయ్యింది. కాంగ్రెస్ ప్రాబల్యం ఉన్న అతి పెద్ద రాష్ట్రం కర్ణాటకనే. మరో ఏడాదిన్నరలో కర్ణాటకలో శాసన సభకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ సమయంలో సిద్దరామయ్య ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ప్రవాసాంధ్రులతో పాటు పొరుగు రాష్ట్రాల ప్రజలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే మా పరిస్థితి ఏమిటి అని ఆందోళనకు గురౌతున్నారు.