బిజెపి సీనియర్ నేత కారుపై దాడి: ఏకే47లతో వంద రౌండ్ల కాల్పులు, విషమం
ఘజియాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బ్రిజ్పాల్ టియోటియా కాన్వాయ్పై గుర్తుతెలియని దుండగులు ఏకే-47లతో కాల్పులకు తెగబడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు ఆయన కాన్వాయ్పై ఏకే-47తో దాదాపు వంద రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం.
ఘటనలో తీవ్రంగా గాయపడిన బ్రిజ్పాల్(49)ను నోయిడాలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దాడిలో మరో ఐదుగురు కూడా త్రీవంగా గాయపడ్డారు. బ్రిజ్పాల్ నోయిడాలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఇన్స్పెక్టర్ జనరల్ సుర్జీప్ పాండే తెలిపారు.
కాగా, టొయోటా ఫార్చ్యునర్ ఎస్యూవీలో వచ్చిన దుండగులు.. బ్రిజ్పాల్ ఉన్న స్కార్పియో వాహనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అనంతరం ఆయుధాలను అక్కడే పడేసి.. దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
కాల్పులకు ఏకే-47లను ఉపయోగించారని.. ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. బ్రిజ్పాల్ ప్రత్యర్థులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్రిజ్పాల్ ఘజియాబాద్ వెళ్తున్న సమయంలోనే ఈ దాడి జరిగిందని తెలిపారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బ్రిజ్పాల్ను కేంద్ర సహాయ మంత్రి మహేశ్ శర్మ పరామర్శించారు. బ్రిజ్పాల్ పరిస్థితి విషమంగానే ఉందని ఆయన తెలిపారు. కాగా, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు బ్రిజ్ పాల్ అత్యంత సన్నిహితుడు.