Nipah Virus : కేరళలో నిఫా కలకలం-12 ఏళ్ల బాలుడు మృతి-ఓవైపు కరోనా వణికిస్తుండగానే...
కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. కోజికోడ్లో 12 ఏళ్ల ఓ బాలుడు నిఫా వైరస్ బారినపడి మృతి చెందాడు.ఆదివారం(సెప్టెంబర్ 5) తెల్లవారుజామున అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ఓవైపు కరోనా రాష్ట్రాన్ని వణికిస్తున్న సమయంలో నిఫా వైరస్ ఓ ప్రాణాన్ని బలిగొనడం ఆందోళన కలిగిస్తోంది.
రెండు రోజుల క్రితం బాలుడు అస్వస్థతకు గురవగా నిఫా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అతని రక్త నమూనాలను పుణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపించారు.అక్కడ నిఫా పాజిటివ్గా నిర్దారణ అయింది. ఆ బాలుడిని మొదట ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి కోజికోడ్లోని మెడికల్ కాలేజీకి తరలించారు.

నిఫా కలకలంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీనా జార్జి మాట్లాడుతూ...'కోజికోడ్లోని సంబంధిత అధికారులతో పాటు జిల్లాకు చెందిన మంత్రులతో చర్చించాం. పరిస్థితిని చక్కదిద్దేందుకు కొన్ని ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.కాంటాక్ట్,ట్రేసింగ్,ఇతర పాత పద్దతులన్నీ ఇప్పటికే మొదలుపెట్టాం.జిల్లాలో ప్రత్యేక అధికారులను నియమించాం.' అని తెలిపారు.
ఇప్పటికైతే ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వీణా జార్జి పేర్కొన్నారు. మృతి చెందిన ఆ బాలుడి కుటుంబ సభ్యులు,అతని కాంటాక్ట్స్లోనూ ఎవరికీ నిఫా లక్షణాలు లేవన్నారు. నిఫా కలకలంతో కేంద్రం నుంచి ఇప్పటికే ఓ బృందం కేరళకు బయలుదేరింది. ఆదివారం రాష్ట్రానికి చేరుకోన్న ఎన్సీడీసీ(National Centre for Disease Control) బృందం... రాష్ట్ర ఆరోగ్యశాఖకు అవసరమైన సాంకేతిక సాయం అందించనుంది.
తాజా కేసుకు సంబంధించి అనుసరించాల్సిన జాగ్రత్తలపై కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. బాధిత బాలుడి కుటుంబం,గ్రామం,చుట్టుపక్కల ప్రాంతాల్లో నిఫా ఆనవాళ్లు ఉన్నాయా అనే విషయం తెలుసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు సూచించింది. బాధిత బాలుడితో గత 12 రోజుల్లో కాంటాక్ట్ అయినవారిని గుర్తించాలని పేర్కొంది. ఆ కాంటాక్ట్స్ను క్వారెంటైన్లో ఉంచాలని సూచించింది.
నిఫా వైరస్ అనేది జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. ముఖ్యంగా గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా ఇది పందులు,కుక్కలు,గుర్రాలు ఇతర జంతువులకు సోకుతుంది. మనుషులకు సోకితే... వైరస్ లోడ్ ఎక్కువైతే మరణం సంభవిస్తుంది. 2018లో కేరళలోని కోజికోడ్,మలప్పురం జిల్లాల్లో ఈ వైరస్ కేసులు బయటపడ్డాయి.పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. తాజాగా నిఫా వైరస్ కారణంగా బాలుడు మృతి చెందడంతో మళ్లీ టెన్షన్ మొదలైంది.
భారీగా కరోనా కేసులు :
దేశవ్యాప్తంగా ఆదివారం(సెప్టెంబర్ 5) 42,766 కరోనా కేసులు నమోదవగా ఒక్క కేరళలోనే 29,682 కేసులు నమోదయ్యాయి.కరోనాతో దేశవ్యాప్తంగా మరో 308 మంది మృతి చెందగా... అత్యధికంగా కేరళలో 142 మృతి చెందారు.కేరళ తర్వాత అత్యధికంగా మహారాష్ట్రలో 4130,తమిళనాడులో 1575,ఆంధ్రప్రదేశ్లో 1502 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనే 88.56శాతం కేసులు నమోదవగా... ఇందులో కేరళలోనే 69.41శాతం కేసులు నమోదవడం గమనార్హం.












Click it and Unblock the Notifications