13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరతారు.. శరద్ పవార్ సెన్సేషనల్ కామెంట్స్
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కంచుకోట ఉత్తరప్రదేశ్.. రాష్ట్రంలో ఆ పార్టీకి ఎన్నికల ముందు షాక్ ఇచ్చేలా మాట్లాడారు. ఇప్పటికే మాజీ మంత్రి బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఎస్పీలో చేరతారని కామెంట్ చేశారు.
యూపీలో ఎస్పీ, ఇతర పార్టీలతో కలిసి ఎన్సీపీ పోటీ చేయనుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆ మార్పును చూస్తాం అని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తప్పకుండా బుద్ది చెబుతారని తెలిపారు. గోవా అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా పవార్ మాట్లాడారు. అక్కడ టీఎంసీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి పోటీ చేసే విషయం ఆలోచిస్తున్నాం అని తెలిపారు.
ఇటు మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య.. తన రాజీనామా లేఖలో.. ఎందుకు రాజీనామా చేశానో వివరించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దళితులు, చిన్న, మద్యతరగతి వ్యాపారులను నిర్లక్ష్యం చేశానని వివరించారు. నిరుద్యోగ యువతను కూడా పట్టించుకోవడం లేదని చెప్పారు. ఆయన తర్వాత 3 ఎమ్మెల్యేలు పార్టీ మారతామని కామెంట్ చేశారు. తిహర్ ఎమ్మెల్యే రోషన్ లాల్ వర్మ, బిలాహౌర్ ఎమ్మెల్యే భగవత్ ప్రసాద్ సాగర్, తింద్వారీ ఎమ్మెల్యే బ్రజేశ్ ప్రజాపతి రాజీనామా చేశారు. వర్మ కూడా ఎస్పీలో చేరాలని అనుకుంటున్నారని విశ్వసనీయంగా తెలిసింది.