కల్తీ మద్యం తాగి 27 మంది మృతి, 100మందికి పైగా అస్వస్ధత
లక్నో: ఉత్తర ప్రదేశ్లో సోమవారం భారీ విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి 27 మంది మృతి చెందారు. 100 మందికి పైగా అస్వస్ధతకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్లోని రెండు జిల్లాల పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఎక్కువ మంది మృతులు మూడు కుటుంబాలకు చెందినవారున్నారు.
లఖ్నవూ వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స కోసం చేర్పించిన వారి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మలీహాబాద్ ప్రాంతంలోని ఖర్తా, మరో గ్రామం, ఉన్నావో జిల్లా హసన్ గంజ్ ప్రాంతంలోని తలసరాయి గ్రామంలో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి.
లక్నోలోని బలరాంపుర్ ఆసుపత్రి ట్రామా సెంటర్లో ఉన్న తొమ్మిది మంది పేషంట్లలో నలుగురు, మలీహాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఇద్దరు, గ్రామంలో ఒకరు చనిపోయినట్లుగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎస్ఎన్ఎస్ యాదవ్ తెలిపారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 12 మంది పరిస్ధితి ఆందోళనకరంగా ఉంది. కొంత మంది కంటిచూపు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై 16 మంది ఎక్సైజ్ శాఖ అధికారులను సస్పెండ్ చేయాలంటూ ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ ఆదేశించారు. విషయాన్ని సీరియస్గా తీసుకున్న మలీహాబాద్ ఏరియా ఎక్సైజ్ కమిషనర్ అనిల్ గార్గ్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్కు చెందిన ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. కల్తీ మద్యం అమ్మకాలు జరిపినందుకు గాను ఐదుగురిపై కేసు నమోదు చేశామని, పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు లక్నో ఐజీ సతీష్ గణేష్ వెల్లడించారు.
కల్తీ మద్యంలో అరికట్టడంలో సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం విఫలమైందంటూ ఉత్తరప్రదేశ్ కాంగ్రెసు చీఫ్ నిర్మల్ ఖత్రీ వ్యాఖ్యానించారు. కేవలం మద్యం వచ్చే ఆదాయాన్ని మాత్రమే ప్రభుత్వం చూసుకుంటుందని వారి ఆరోగ్యం గురించి ఆలోచించడం లేదని ధ్వజమెత్తారు.
ఇక యూపీ బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహుదూర్ మాట్లాడుతూ సమాజ్ వాదీ పార్టీ పదవిలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కల్తీ మద్యం వరదలా పారిస్తున్నారని అన్నారు. గతంలో కూడా ఇలాంటి దుర్ఘటనసు సమాజ్ వాదీ పార్టీ సుప్రిమో ములాయం సింగ్ యాదవ్ లోక్సభ పరిధిలో కూడా జరిగిందని గుర్తు చేశారు.