రోడ్డు ప్రమాదాల్లో రాలిపోతున్న వలస కార్మికులు: 14 మంది దుర్మరణం
న్యూఢిల్లీ: లాక్డౌన్ వల్ల ఉపాధిని కోల్పోయి రోడ్డున పడిన వలస కార్మికులు ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఉపాధి లేకపోవడం వల్ల తమ స్వస్థలాలకు కాలినడకన బయలుదేరిన వారు మృత్యువాత పడుతున్నారు. కొద్దిరోజుల కిందటే మహారాష్ట్రలో గూడ్స్ రైలు ఢీ కొని 14 మంది వలస కార్మికులు మరణించారు. తాజాగా ఒకేరోజు కొన్ని గంటల వ్యవధిలో వేర్వేరు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో మరో 14 మంది మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్లల్లో ఈ రెండు ప్రమాదాలు సంభవించాయి.
మధ్యప్రదేశ్లోని గుణ వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది, ఉత్తర ప్రదేశ్లోని ముజప్ఫర్ నగర్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. 50 మందికి పైగా గాయపడ్డారు. వారంతా వలస కార్మికులే. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. కోవిడ్ ఆసుపత్రుల్లో వారికి చికిత్స అందిస్తున్నారు.

మహారాష్ట్ర నుంచి ఉత్తర ప్రదేశ్కు వలస కార్మికులతో బయలుదేరి ట్రక్కు మధ్యప్రదేశ్లోని గుణ వద్ద ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తోన్న బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్రక్కులో ప్రయాణిస్తోన్న వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 50 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే కంటోన్మెంట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
ఉత్తర ప్రదేశ్లోని ముజప్ఫర్ నగర్ వద్ద సంభవించిన మరో ప్రమాదంలో ఆరుమంది వలస కార్మికులు మరణించారు. ముజప్ఫర్ నగర్-సహరాన్ పూర్ మార్గంపై కాలినడకన వెళ్తోన్న వలస కార్మికులపై ఓ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరు మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారందరి నుంచి డాక్టర్లు కరోనా వైరస్ నమూనాలను సేకరించారు.












Click it and Unblock the Notifications