పోలీస్ స్టేషన్లో ప్రసవించిన మైనర్ బాలిక... అత్యాచారంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లి...
తనపై జరిగిన అత్యాచారంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ మైనర్ బాలిక(14) అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. అత్యాచారం కారణంగా గర్భం దాల్చిన ఆ బాలికకు పోలీస్ స్టేషన్లో ఉన్న సమయంలోనే పురిటి నొప్పులు వచ్చాయి. బాలిక అక్కడే ప్రసవించగా... అనంతరం తల్లీబిడ్డలను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
చింద్వారా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఆ బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ టీనేజర్ గతేడాది నవంబర్,డిసెంబర్లలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి.. ఆ విషయం ఎవరికీ చెప్పకుండా జాగ్రత్తపడ్డాడు. అప్పటికే బాలిక గర్భం దాల్చగా... నెలలు గడుస్తున్నా అతని వైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోయింది. ఇటీవల ఆ బాలిక పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా అందుకు నిరాకరించాడు. దీంతో బాలిక తన కుటుంబ సభ్యులను వెంటపెట్టుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. ఆ సమయంలోనే పురిటి నొప్పులు రావడంతో అక్కడే ప్రసవించింది.
ఈ ఘటనపై స్థానిక పోలీస్ అధికారి పుర్వా చౌరాసియా మాట్లాడుతూ... ఆమె పోలీస్ స్టేషన్కు వచ్చిన కొద్దిసేపటికే పురిటి నొప్పులు వచ్చాయని... నొప్పులు తట్టుకోలేక బాలిక బిగ్గరగా ఏడ్చిందని చెప్పారు. బాలికను పోలీస్ స్టేషన్లోని ఓ గదిలోకి షిఫ్ట్ చేశామని... అక్కడే ప్రసవం జరిగిందని చెప్పారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని... ప్రస్తుతం తల్లీబిడ్డల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
బాలిక ఫిర్యాదు మేరకు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. తనపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు... పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లుగా ఆమె ఫిర్యాదు చేసిందన్నారు.నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తామని... బాలికకు న్యాయం జరిగేలా చేస్తామని చెప్పారు.