రాజస్థాన్ లో దారుణం: విద్యార్థినిపై పాఠశాల యజమాని సామూహిక అత్యాచారం, ఆపైన హత్యాయత్నం
రాజస్థాన్ లో విద్యార్థినిపై పాఠశాల యజమాని సామూహిక అత్యాచారం, ఆపైన హత్యాయత్నం
చురు: ఓ విద్యాసంస్థ యజమాని తన బంధువుతో కలిసి తన పాఠశాలలోనే చదువుకుంటున్న ఓ విద్యార్థిని(15)పై అత్యాచారం చేయడమే కాక, తమ కిరాతకం బయట పడుతుందన్న అనుమానంతో ఆ విద్యార్థినిని మట్టుబెట్టేందుకు ప్రయత్నించిన ఉదంతమిది.
రాజస్థాన్ లోని చురు జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన ఈ అమానుష ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక చురు జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్లస్ టూ చదువుతోంది.
తన పాఠశాలలో చదువుతున్న ఆ బాలికను ఆమె ఇంటినుంచే సదరు పాఠశాల యజమాని అపహరించినట్లు సమాచారం. ఆపైన అతడు తన బంధువుతో కలిసి అత్యాచారానికి పాల్పడి, ఎక్కడ దొరికిపోతామో అన్న భయంతో ఆ విద్యార్థినిని చంపేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో వారు ఆ విద్యార్థిని కళ్ళలో పొడిచి, వెన్నెముకను కూడా విరిచేశారు. ప్రస్తుతం ఆ విద్యార్థిని జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
మరోవైపు ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన వారే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుంటే తమ పిల్లలకు రక్షణ ఎక్కడుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.