లోయలో పడిన బస్సు, 16 మంది మృతి (ఫోటో)
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలో శనివారం ఓ బస్సు లోయలో పడి 16 మంది మృతి చెందగా, మరో 17 మందికి గాయాలయ్యాయి. హరిద్వార్ నుంచి కర్ణప్రయోగ్ వెళుతున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది.
33 మందితో ప్రయాణిస్తున్న బస్సు జుయల్ గడ్ సమీపంలో 300 అడుగుల లోయలో పడిపోయిందని తెహ్రీ ఎస్పీ ముక్తార్ మోహసిస్ తెలిపారు. అలకనంద నదిలో కలిసే పాయలో బస్సు సగం వరకు మునిగిపోయిందని ఎస్పీ ముఖ్తర్ మొహిసిన్ పేర్కొన్నారు.
బస్ డ్రైవర్ మరో వాహనాన్ని అధిగమించేందుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆయన చెప్పారు. మృతుల కుటుంబాలకు సీఎం హరీష్ రావత్ రూ. లక్ష, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
తమిళనాడులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిండిగల్ సమీపంలో కారును లారీ ఢీ కొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు మరణించారు. మరో నలుగురి పరిస్దితి విషమంగా ఉంది. బాధితులను చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తరలించారు.