విద్యార్థినిపై క్లాస్ మేట్స్ గ్యాంగ్ రేప్
గుర్గావ్: స్కూల్ విద్యార్థిని మీద సాటి క్లాస్ మేట్స్ గ్యాంగ్ రేప్ చేసి రోడ్డు పక్కన వదిలి వెళ్లారు. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. న్యూఢిల్లీ సమీపంలోని గుర్గావ్ శివార్లలో ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు.
పోలీసులు తెలిపిన కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుర్గావ్ కు 20 కిలోమీటర్ల దూరంలోని స్కూల్ లో 16 సంవత్సరాల బాలిక విద్యాభ్యాసం చేస్తున్నది. గత శుక్రవారం బాలిక స్కూల్ నుండి బయలుదేరి సమీపంలోని బస్ స్టాప్ దగ్గరకు వెళ్లింది.
ఇంటికి వెళ్లడానికి బస్సు కోసం వేచి ఉంది. బాలిక చదువుతున్న స్కూల్ లో ఆమెతో పాటు విద్యాభ్యాసం చేస్తున్న నలుగురు క్లాస్ మేట్స్ బస్ స్టాప్ దగ్గరకు వెళ్లారు. మాతో పాటు రావాలని బాలికకు చెప్పారు. తనతో పాటు చదువుతున్నారని వారిని విద్యార్థిని నమ్మింది.
వారితో కలిసి బాలిక వెళ్లింది. తరువాత నిర్జన ప్రదేశంలోకి తీసుకు వెళ్లిన నలుగురు విద్యార్థులు బాలిక మీద సామూహిక అత్యాచారం చేశారు. తరువాత బాలికను రోడ్డు పక్కన వదిలి పరారైనారు. ఇంటికి వెళ్లిన బాలిక కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది.
బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు విద్యార్థులను బాలిక గుర్తు పట్టడంతో వారిని అరెస్టు చేశారు. నలుగు విద్యార్థులను కోర్టు ముందు హాజరుపరిచి బాలనేరస్తుల కేంద్రానికి తరలించామని సోమవారం పోలీసు అధికారులు తెలిపారు.